జగన్పార్టీలో వారు దారి చూసుకుంటున్నారు, గాలం!
హైదరాబాద్: రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్త కాదు. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రారంభమైంది! ఆయా ప్రజాప్రతినిధులు తమ సభ్యత్వాలను కోల్పోకుండా.. అధికార పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. పలువురు నేతలు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు విపక్ష ప్రజాప్రతినిధులు పలువురు మొగ్గు చూపుతున్నారు.
ఆయా అధికార పార్టీలు కూడా తమ వైపుకు వస్తారని భావిస్తున్న విపక్ష నేతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా అయితే.. ఓ పార్టీ నుండి గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలలో చేరాలంటే వారు పార్టీకి, పదవికి రాజీనామా చేయాలి. అయితే, ఇప్పుడు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనుబంధంగా కొనసాగేందుకు సిద్ధపడుతున్నారు. అది కొత్తకాకపోయినప్పటికీ.. ఇరు రాష్ట్రాల్లోను చాలామంది అందుకు సిద్ధంగా ఉన్నారట.
దాదాపు ఇరవై మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ భావిస్తోందట. అందుకోసం వారు జగన్ పైన తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. జగన్ నుండి దూరం జరిగేందుకు వారు.. ఓటమికి ఆయననే బాధ్యుడిని చేస్తూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా శుక్రవారం పైలా నర్సింహ రావు జగన్ పైన నిప్పులు చెరిగారు.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తొలుత టీడీపీకి అనుబంధంగా కొనసాగేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. తాజాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వేటు పడకుండా ఉండేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారట.
చంద్రబాబుకు సన్నిహితుడైన ఎంపీ సీఎం రమేష్ పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నారట. తాను తన నియోజకవర్గం అభివృద్ధి కోసం టీడీపీతో కలిసి పని చేస్తానని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తొలి షాక్ ఇచ్చారు. ఈయనను డిస్క్వాలిఫై చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఇది పెండింగులో ఉంది.
పార్టీ మారితే తాము చర్యలు తీసుకుంటామని విపక్ష నాయకత్వం చెబుతున్నప్పటికీ.. టీడీపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెరాసలో తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు చేరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తెలంగాణలో తెరాస వైపుకు, ఏపీలో టీడీపీ వైపుకు చూస్తున్నారు.