వాళ్లు వెళ్లొచ్చు, టీడీపీ-వైసీపీ డబ్బులిస్తే వస్తారు, నా వాళ్లు అమ్ముడుపోరు: పవన్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 2019లో జనసేన జెండా ఎగరడం ఖాయమని, సరికొత్త రాజకీయం రాబోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పారు. జనసేన పార్టీకి జనసైనికులే జీవం పోశారన్నారు. నాయకులు ఉండవచ్చు, వెళ్లిపోవచ్చు కానీ జనసైనికులు ఎప్పుడూ నాతోనే ఉంటారని చెప్పారు.
Recommended Video
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు డబ్బులు ఇస్తే జనం వస్తారని, జనసేనకు మాత్రం స్వచ్చంధంగా ప్రేమతో వస్తారని పేర్కొన్నారు. వారు డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదని చెప్పారు. జనసేన పార్టీలో చేరిన నాయకులు జనసైనికులను గౌరవించాలని సూచించారు. వారిని గౌరవిస్తే... నన్ను గౌరవించినట్లేనని చెప్పారు.
రెండూ ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించా
ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమను పంచిన మీకు.. నా తుది శ్వాస వరకు వెన్నంటి ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు తాను ప్రజా జీవితంలోనే ఉంటూ వారికి అండగా ఉంటానని చెప్పారు. నటన ఉత్తరాంధ్ర నుంచి ఎలాగైతే ప్రారంభించానో.. రాజకీయ ప్రయాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించానని చెప్పారు.
2003లో రాజకీయాల్లోకి రావాలనుకున్నా
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదని వెనక్కి నెట్టిన ప్రాంతమని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర యాస, భాష, కళలతో పాటు ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు. ఈ ప్రాంత స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయకులకే జనసేన పెద్దపీట వేస్తుందన్నారు. ఇవాళ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. 2003లో రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.
బీజేపీని కేంద్రమంత్రి పదవి, టీడీపీతో బేరసారాలు ఆడేవాడిని
2009లో పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం తాను సమస్యలను అర్థం చేసుకోవడానికేనని పవన్ చెప్పారు. 2014లో సుస్థిరత కోసం టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని చెప్పారు. రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకుంటే ఆనాడు బీజేపీని కేంద్రమంత్రి పదవి, టీడీపీతో బేరసారాలు ఆడేవాడినని చెప్పారు. కానీ దేశ రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయని చెప్పడానికే తాను ఏమీ ఆశించకుండా మద్దతు తెలిపానని చెప్పారు. అనంతరం జనసైనికుల శిక్షణ గురించి పేర్కొన్నారు.
పవన్ సమక్షంలో జనసేనలోకి పలువురి చేరిక
పవన్ సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. పార్టీలోకి బీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కోన తాతారావు, అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల శ్రీరాం, ప్రముఖ క్రికెటర్ వేణుగోపాల రావు, విశాఖపట్నంకు చెందిన బాలాజీ స్కూల్స్ అధినేత మండవ రవి కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామచంద్ర రావులు తమ అనుచరులతో పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. దానిని ట్వీట్ చేశారు.