కెసిఆర్ వ్యాఖ్య, నెహ్రూ హెచ్చరిక: జగన్కు అన్నీ రివర్స్?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని పార్టీకి చెందిన నేతలు వాపోతున్నారట. ఆయన మడమ తిప్పకుండా వెనుకడుగు వేస్తున్నారనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ వేసే ప్రతి అడుగు రివర్స్ అవుతోందని సొంత పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారంటున్నారు. అసెంబ్లీలో ఆయన అవిశ్వాస తీర్మానం, విప్ జారీ అంశంలో టిడిపిదే పైచేయి అయింది.
పట్టిసీమ పైన జగన్ నిప్పులు చెరుగుతున్నారు. చివరకు తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా మెచ్చుకోవడం వైసిపికి ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు. మరోవైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పార్టీని వీడితున్నారు.
పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను ఆయన పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. వెళ్లి పోయే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కూడా జగన్లో కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తాను దేవుడినే నమ్ముకున్నానని, నేతలను నమ్ముకోలేదని జగన్ పదేపదే చెబుతున్నారు. అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో నేతల పాత్ర ఏం లేదా అని సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారని అంటున్నారు.
కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని, నేతలు వెళ్తే వెళ్లనీయండని రాజకీయ నాయకులు చెప్పడం సహజమేనని, కానీ గుట్టు చప్పుడు కాకుండా వారిని బతిమాలుకునే ధోరణి ఉంటుందని, కానీ జగన్ విషయంలో అది కనిపించడం లేదని అంటున్నారు.
నేతలను పట్టించుకోకపోవడాన్ని పక్కన పెడితే, గురువారం తెలంగాణ అసెంబ్లీలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు టిడిపికి ఏపీలో కొత్త ఉత్సాహాన్నిచ్చాయని అంటున్నారు. కెసిఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు పట్టిసీమ అవసరమని చెబుతూ చంద్రబాబును పొగిడారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
తాజాగా, పార్టీ నుంచి వెళ్లిపోతున్న జ్యోతుల నెహ్రూ కూడా జగన్ తీరు పైన విమర్శలు గుప్పించారు. వైసిపిలో సమష్టి నాయకత్వం, సమష్టి ఆలోచనలు లేవన్నారు. వైసిపి అధినేత మారాలని హితవు పలికారు. గతంలో పార్టీని వీడిన వారు కూడా జగన్ తీరు పైనే విమర్శలు గుప్పించారు. పార్టీని వీడుతున్న వారు పదేపదే జగన్ వైఖరిని తప్పుబడుతుండటం కూడా చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications