అమరావతి పర్యటనకు సింగపూర్ ప్రధాని 'నో'.. ఎందుకు?
విజయవాడ : ఎప్పుడూ సింగపూర్ నామస్మరణలో తరించిపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఓవైపు సింగపూర్ పీఎం ఇండియాలోనే పర్యటిస్తున్నా ఆయన్ను అమరావతికి ఎందుకు తీసుకురాలేకపోయారనేది ఇప్పుడు చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. రాజధాని గురించి ప్రస్తావించిన చాలా సందర్బాల్లో.. సింగపూర్ ప్రధానిని అమరావతికి ఆహ్వానించానని చంద్రబాబు చాలాసార్లు పేర్కొనడం ఈ ప్రశ్నను ఇప్పుడు ఇంతలా తెరమీద చర్చల్లో నానేలా చేసింది.

అసలు సింగపూర్ ప్రధాని ఇండియాలో అడుగుపెడితే చంద్రబాబు అమరావతికి ఆహ్వానించకుండా ఎలా ఉంటారు? ఆయన్ను అమరావతికి ఆహ్వానించారు గానీ స్విస్ ఛాలెంజ్ వ్యవహారం కాస్త ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో.. ఇలాంటి తరుణంలో.. అమరావతిలో అడుగుపెడితే సొంత దేశం కంపెనీల నుంచే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందన్న ఉద్దేశంతో అమరావతి పర్యటనకు సెయిన్ లూంగ్ దూరంగా ఉండిపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా.. ఆయన మాత్రం అమరావతిలో అడుగుపెట్టేందుకు ససేమిరా అన్నారన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఈ విషయమై టీడీపీ నేతలను ఎవరైనా ప్రశ్నిస్తే..? ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి వారిది. అయితే ఇప్పటికీ ఆశ వదులుకోని చంద్రబాబు మాత్రం ఇండియా టూర్ అయిపోయే లాగా సింగపూర్ ప్రధానిని ఎలాగైనా అమరావతికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో!












Click it and Unblock the Notifications