భర్తతో కలిసి మహిళను వివస్త్రను చేసి వీడియో తీసి....
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.వామపక్ష పార్టీకి చెందిన నేతతో పాటు మరికొందరు భర్తతో లిసి ఓ వివాహితను వివస్త్రను చేశారనే ఆరోపణలు వచ్చాయి.
వివస్త్రను చేసిన దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. గాయాలు కావడంతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నారు..
ఆ దారుణమైన ఘటన కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు న్యూ ఇందిరమ్మకాలనీలో బుధవారం జరిగింది. బాధితురాలు ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేసింది. ఇందిరమ్మకాలనీకి చెందిన అత్తులూరి సౌమ్య, ప్రదీప్ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. సౌమ్య క్యాటరింగ్ పనులు చేసుకుంటోంది. ప్రదీప్ ఆటో నడుపుతుంాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తున్నారు.
ఆమెపై కన్నేసిన వామపక్ష నేత..
వామపక్ష పార్టీకి చెందిన ఓ నేత ఆమెపై కన్నేశాడు. నిరుడు సెప్టెంబర్ 1వ తేదీ సౌమ్య పనులు ముగించుకుని నెల్లూరు నగరంలో నుంచి ఇంటికి వస్తుండగా అన్నమయ్య సర్కిల్ వద్ద ఆమెను అడ్డగించి బలవంతం చేయబోయాడనే ఆరోపణలు వచ్చాయి. ప్రతిఘటించిన బాధితురాలు అతని నుంచి తప్పించుకుంది. అప్పట్లో నాల్గోనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై లైంగిక దాడియత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును విచారణ నిమిత్తం ఎస్సీ, ఎస్టీ సెల్కు బదిలీ చేశారు.
అంతుచూస్తామని బెదిరించాడు..
కేసు విషయంలో రాజీకి రావాలని, లేదంటే అంతు చూస్తామని వామపక్ష పార్టీ నేత బెదిరిస్తూ వచ్చాడు. ఆమె నిరాకరించడంతో భర్త, అత్తమామల ద్వారా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఒక దశలో ఆమె ఇంటిపై దాడికి యత్నించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పారిపోయారు. అప్పటి నుంచి ఆమె చాలాసార్లు స్థానిక నెల్లూరు రూరల్ పోలీసులకు అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని అభ్యర్థించింది.
నీ భర్త పార్టీ ఆఫీసు వద్ద ఉన్నాడని చెప్పి..
బుధవారం సాయంత్రం సౌమ్య టీ అంగడికి వెళ్లి వస్తుండగా నీ భర్త పార్టీ ఆఫీసు వద్ద ఉన్నాడని, అక్కడికి రమ్మని ఆమెను కొందరు పార్టీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారని చెబుతున్నారు. అక్కడ శ్రీహరి, సౌమ్య భర్త ప్రదీప్, మరికొందరు ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు.
ఆ తర్వాత కూడా ఇలా....
ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని బలవంతంగా ఆస్పత్రిలో నుంచి తీసుకెళ్లేందుకు యత్నించింది. బాధితురాలి ప్రతిఘటించి నీపై కూడా కేసు పెడుతామని బెదిరించడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు బాధితురాలు జీజీహెచ్ ఔట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.