ఆ అర్హత ఉంది: తెలుగుకు ప్రాచీన హోదాపై తేల్చిన హైకోర్టు, యార్లగడ్డ హ్యాపీ
చెన్నై: తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని న్యాయస్థానం పేర్కొంది.
నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేసింది. తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం సంచాలకుడు మామిడి హరికృష్ణ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు. కాగా, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా అర్హత ఉందని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది.
యార్లగడ్డ హర్షం
తెలుగు భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంపై ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇది సంతోషకరమైన విషయమని అన్నారు.
తెలుగును ప్రపంచ భాషగా మార్చేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని, తెలుగు భాషపై ఉదాసీనంగా ఉండటం తగదని ఆయన సూచించారు. భాషా అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినా తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తెలుగును ఆధునిక భాషగా గుర్తించేందుకు కృషి చేయాలని యార్లగడ్డ అన్నారు.