పోడియంవద్ద 35మంది మార్షల్స్: టి గడువుపై సస్పెన్స్
చర్చల్లో పాల్గొనేందుకు ఇవాళ చివరి అవకాశమని, అందరూ సహకరించాలని స్పీకర్ పదే పదే కోరినా సభ్యులు పట్టించుకోలేదు. అంతకుముందు సభాపతి విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. కాగా, సీమాంధ్ర నేతలు ఓటింగు కోరుతూ, తెలంగాణ నేతలు కిరణ్ నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ పోడియంను చుట్టుముట్టే అవకాశాలు ఉన్నందున 35 మంది మార్షల్స్ను స్పీకర్ పోడియం వద్ద ఉంచారు.
డొక్కా అఫిడవిట్
మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, బాలరాజులు గురువారం సభాపతి నాదెండ్ల మనోహర్కు అఫిడవిట్లు ఇచ్చారు.
టిడిపి ఎమ్మెల్యేల ధర్నా
అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభ్యలు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ముసాయిదా బిల్లుపై ఓటింగు పెట్టడంతో పాటు బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. అంతకముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. సమైక్య తీర్మానం కోసం వారు పట్టుబట్టారు.
ఓటింగ్, గడువుపై సస్పెన్స్
ఓటింగ్, గడువు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. బిల్లుపై చర్చకు ఈ రోజు ఆఖరు కావడం, మరోవైపు ముఖ్యమంత్రి మరో మూడు వారాల గడువు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. గడువు పైన రాష్ట్రపతి సమాచారం కోసం మధ్యాహ్నం వరకు చూసి ఓటింగ్ పెట్టే అవకాశముంది.