చంద్రబాబుకు తీపి కబురు: అసెంబ్లీ సీట్లపెంపుపై ముందడుగు
హైదరాబాద్ / న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో అందరికీ టిక్కెట్లు ఇస్తామని రాజకీయంగా బలోపేతం కావడానికి అన్ని పార్టీల నేతలను తమ పార్టీల్లో చేర్చుకున్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు నెరవేరే సంకేతాలే కనిపిస్తున్నాయి.
అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమూలంగా రాజకీయ పరిణామాలే మారిపోనున్నాయి. అధికారంలో ఉన్నందున వారిద్దరూ నియోజకవర్గాలను తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీని ప్రకారం ఇటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీకే రాజకీయంగా మేలు కలుగుతుంది. మరో ఐదేళ్ల పాటు అధికారం కోసం విపక్షాలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇలా రాజ్యాంగ సవరణకు ఓకే
ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత ఫైల్కు న్యాయశాఖ ఆమోదముద్ర వేసి హోంశాఖకు పంపినట్లు వినికిడి. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ఆర్టికల్ కింద పొందుపరిచిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయశాఖ సవరణలు సూచించినట్లు సమాచారం.
ఇలా చొరవ తీసుకున్న రాజ్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు బాధ్యత హోంశాఖపై ఉన్నందున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపై దాదాపు రెండు నెలల క్రితం న్యాయశాఖ సలహా కోరారు. దీంతో న్యాయశాఖ అన్ని కోణాల్లో పరిశీలించి గత అటార్నీ జనరల్ ఇచ్చిన సూచనను సమర్థిస్తూనే, రాజ్యాంగ సవరణ ఎలా చేయాలో సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ రాజ్యాంగ సవరణకు మళ్లీ 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని, కేవలం పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తే సరిపోతుందని పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర హోంశాఖ తదుపరి అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ సవరణవల్ల ఇతరత్రా ప్రభావాలేమైనా ఉంటాయా? అని నిర్ధారించుకున్న తర్వాత కేబినెట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తర్వాత దీన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటుకు బిల్లు రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి కావాలని టీఆర్ఎస్, టీడీపీ, ఆకాంక్షిస్తున్నాయి.
ఎన్నికల సంఘం నిర్ణయమే సుప్రీం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నా ఆ అంశం సాఫీగా పూర్తి కావాలంటే చేయాల్సిన తతంగం చాలానే ఉన్నది. ముందస్తుగానే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఆ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘమే పూర్తి చేయాలి. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు, మరో ఇద్దరు కమిషనర్లకు ఇందులో పాత్ర ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కూ స్థానం కల్పిస్తేనే ప్రక్రియ సాఫీగా సాగడానికి వీలవుతుంది. విభజన అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి 2003 నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘం కమిషనర్లనూ ఇందులో ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమించారు. ఇప్పుడూ అదే నిబంధన ఇక్కడా వర్తింపజేయాలి.
Recommended Video
పార్లమెంట్ సరిహద్దుల పెంపునకు ఓకే
నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం 1975, 2008లో జిల్లాలను యూనిట్గా తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఏ ప్రాతిపదికన విభజించాలన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. విభజన చట్టంలోని సెక్షన్ 1(సి)లో పార్లమెంటు నియోజకవర్గ సరిహద్దులను మార్చవచ్చని స్పష్టంగా చెప్పారు. ఆర్టికల్ 81(ఎ), క్లాజ్-2 ప్రకారం రాష్ట్ర జనాభా అన్ని అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సమానంగా ఉండాలి. ఈ నిబంధనను నెరవేర్చాలంటే అసెంబ్లీ స్థానాల విభజనకు జిల్లాను యూనిట్గా చేసుకోవాలి. ఒకవేళ పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్గా చేసుకుంటే రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనను అమలు చేయడం కష్టతరంగా మారుతుంది.
2011 జన గణన ప్రకారమే విభజన
నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానం ఒక జిల్లా పరిధిలోనే ఉండాలి. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచకూడదు తప్పా వాటి సరిహద్దులు మార్చడానికి అడ్డంకులే లేవు. ఈ నిబంధన ఆధారంగా పశ్చిమబెంగాల్లో 2016లో మూడు లోక్సభ స్థానాల సరిహద్దుల్లో మార్పులు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయ రాష్ట్రాల్లో జిల్లా యూనిట్గా చేసుకుని విభజన ప్రక్రియ చేపట్టాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల విభజన ప్రక్రియ జరిగేలా చూసుకోవాలి. అలాగే మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా కేంద్ర హోంశాఖ గడువు విధిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.