ఇంకా అజ్ఞాతంలోనే మల్లాది విష్ణు: గాలింపును ముమ్మరం చేసిన పోలీసులు
హైదరాబాద్: కృష్ణలంక స్వర్ణబార్లో కల్తీమద్యం సేవించి ఐదుగురు మరణించిన ఘటనపై ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే.
ఆ మరుక్షణం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లాది విష్ణు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. ఈ కల్తీమద్యం ఘటనకు సంబంధించి మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను సిట్ బృందం అదుపులోకి తీసుకుని విష్ణు ఆచూకీపై ప్రశ్నిస్తున్నారు.
కాగా మల్లాది విష్ణుని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న భావనతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు మల్లాది విష్ణుకు షల్టర్ ఇచ్చినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్కు బయల్దేరి వెళ్లింది. మరోవైపు మల్లాది విష్ణుకు సంబంధించిన సెల్ ఫోన్ కాల్స్ ఒరిస్సాలోని కటక్ నుంచి వచ్చినట్లు విశ్వసమీయ సమాచారం మేరకు మరో బృందం రెండు రోజుల క్రితమే అక్కడికి బయల్దేరి వెళ్లింది.
ప్రస్తుతం మల్లాది విష్ణు కోసం పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు. కృష్ణలంకలోని స్వర్ణబార్లో మద్యం సేవించిన కారణంగానే ఐదుగురు చనిపోగా, 29 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వర్ణబార్ మల్లాది విష్ణు తమ్ముడి పేరుమీద ఉండటం, ఆయన తల్లి బాల త్రిపుర సుందరమ్మకు వాటా ఉన్న నేపథ్యంలో వారి పేర్లను పోలీసులు ఏఫ్ఐఆర్లో చేర్చారు.