బెజవాడలో రేషన్ ఇప్పించలేదని ఇద్దరు వాలంటీర్లపై దాడి- గర్భవతి అనీ చూడకుండా..
విజయవాడ వైఎస్సార్ కాలనీలో రేషన్ ఇప్పించలేదన్న కోపంతో సాదిక, మేరీ అనే ఇద్దరు మహిళా వాలంటీర్లపై స్ధానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తొలుత సాధిక అనే వాలంటీర్ తమకు రెండో విడత రేషన్ ఇప్పించలేదన్న కోపంతో బ్లాక్ 157 వాసులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడికి దిగారు.
వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో వాలంటీర్ మేరీపైనా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గర్భవతి అని కూడా చూడకుండా జనం మేరీపై దాడి చేయడం వివాదాస్పమవుతోంది.
జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో రేషన్ ఇప్పించలేదన్న సాకుతో తమపై స్ధానికులు దాడి చేయడంపై వాలంటీర్లు టూటౌన్ పోలీసు స్టేషన్ కు ఫోన్ ద్వారా తెలిపినా వారు 100కి డయల్ చేయాలని చెప్పి తప్పించుకున్నారు.
దీంతో వారు చివరికి 100కి డయల్ చేయడంతో దాడి పూర్తయ్యాక పోలీసులు వచ్చి నిందితులపై కేసు నమోదు చేశారు. అప్పటికే స్ధానికుల దాడిలో ఇద్దరు మహిళా వాలంటీర్లు గాయాలపాలయ్యారు. దీంతో దాడికి నిరసనగా ఇతర వాలంటీర్లతో కలిసి వీరంతా స్ధానిక వార్డు సచివాలయం వద్ద నిరసనకు దిగారు. వాలంటీర్లపై జరుగుతున్న దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.