ప్రకాశంలో అమానవీయం- మూడు కోవిడ్ మృతదేహాల అంత్యక్రియల అడ్డగింత-జీజీహెచ్ లోనే కుళ్లుతున్న...
కరోనా వైరస్ భయాలతో జనంలో మానవత్వం నశిస్తున్న ఘటనలు దేశ విదేశాల్లో జరుగుతున్నవి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో సైతం ఇలాంటి ఘటనే ఎదురైంది. కరోనా మృతులకు దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు మూడు సార్లు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎక్కడికక్కడ జనం వాటిని అడ్డుకున్నారు. దీంతో చివరిగా ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఒంగోలు జీజీహెచ్ లోనే వాటిని భద్రపరచాల్సిన పరిస్దితి నెలకొంది.
ఖైదీలకు కరోనా భయం .. 'మహా ' జైళ్ళలో నరకం .. దారుణ స్థితిపై హైకోర్టు కీలక ఆదేశం
మంటగలుస్తున్న మానవత్వం...
కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వాలు చెప్పే మాటలను జనం అస్సలు విశ్వసించడం లేదని ఏపీలో తాజా ఘటనలు రుజువు చేశాయి. కరోనా వ్యాఫ్తి భయాలు జనంలో ఏ స్దాయిలో ఉన్నాయో కూడా ఇవి వాస్తవంలో చూపాయి. తాజాగా ఒంగోలు నగరంలో మూడు వేర్వేరు ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరి అంత్యక్రియల నిర్వహణ విషయంలో అధికారుల్లో డైలమా ఏర్పడింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దహన వాటికల్లో మృతదేహాలను దహనం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తీరా దహన వాటికకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నగరంలో స్ధానికులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ మృతదేహాలను వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది.
రెండోసారీ చుక్కెదురు...
ఒంగోలు నగరంలోని దహన వాటికలో కరోనా మృతుల అంత్యక్రియలను జనం అడ్డుకోవడంతో అధికారులు సమీపంలోని కమ్మపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడకు మృతదేహాలు తరలిస్తున్న సమాచారం అందుకున్న స్ధానికులు అక్కడ కూడా వీటిని ఖననం చేసేందుకు వీలు లేదని అడ్డగించారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వీరు పట్టించుకోలేదు. మృతదేహాలతో అధికారులు అక్కడే కొన్ని గంటల పాటు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భౌతిక కాయాలను తిరిగి ఒంగోలు జీజీహెచ్ కు తీసుకొచ్చేశారు.
నిన్న మూడో ప్రయత్నం....
స్ధానికుల అభ్యంతరాలతో పరిస్దితి ఉద్రిక్తంగా మారుతుండటంతో అధికారులు ఈసారి పోలీసుల సాయంతో మృతదేహాలు లేకుండా పరిస్ధితి గమనించేందుకు ఒంగోలు సమీపంలోని యరజర్ల స్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ పరిస్ధితిని బట్టి మృతదేహాలను తీసుకురావాలని భావించారు. కానీ అక్కడ కూడా సమాచారం అందుకున్న స్ధానికులు భారీగా తరలివచ్చారు. మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు వీలు లేదంటూ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంత్యక్రియలను అడ్డుకునేందుకు ఏకంగా రోడ్డుపైనే కూర్చుని ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చింది.
జీజీహెచ్ లోనే మృతదేహాలు...
ఒంగోలు నగరంలో కరోనా వైరస్ తో చనిపోయిన ముగ్గురు బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే పరిస్ధితి లేకపోవడంతో వాటిని జీజీహెచ్ లోనే భద్రపరిచారు. కానీ ఎక్కువ రోజులు భద్రపరిచే పరిస్ధితి లేకపోవడంతో ఉన్నతాధికారులకు పరిస్ధితిని నివేదించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగినప్పుడు స్వయంగా సీఎం జగన్... కరోనా మృతులపై కనికరం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఏదో ఒక రోజు మనకూ ఇలాంటి పరిస్దితి రావొచ్చంటూ సున్నితంగా హెచ్చరికలు కూడా చేశారు. దీంతో తాజాగా ఒంగోలు ఘటనలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Recommended Video