చౌధురి వ్యాఖ్యలు కరెక్ట్ కాదా?: పెను ప్రమాదం ఉందని హెచ్చరించిన ఎంపీ
అమరావతి: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ఏ ముహూర్తంలో ప్రవేశపెట్టారో తెలియదు గానీ, ఆరోజు కేంద్రమంత్రి హెచ్పీ చౌధురి ఏపీకి కావాల్సినన్ని నిధులిస్తున్నాం కదా ఇంకా ప్రత్యేక హోదా ఎందుకు? అంటూ చేసిన వ్యాఖ్యల వేడి రాష్ట్రంలో చల్లారలేదు.
తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన గాయాల నుండి ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన ఎన్డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమ బాట పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. యుపీఏ ప్రభుత్వం 2014లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకాలేదని ఆయన వాపోయారు.
దేశంలో ఉన్న అన్ని రాజకీయా పార్టీలతో పాటు బీజేపీ కూడా అందుకు అంగీకరిచిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి, అప్పటి రాజ్యసభ ఎంపీగా ఉన్న వెంకయ్య నాయుడు ఐదుకాదు.... పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఇది మరింత పెరిగితే అదుపు చేయటం ప్రజాప్రతినిధులకు సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. విభజన మూలంగా సీమాంధ్ర తీవ్ర ఆర్థిక సమస్యల్లో పడిపోయిందన్నారు. ఐటి, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పబ్లిక్ రంగ పరిశ్రమలు తెలంగాణలోనే కేంద్రీకృతమై ఉన్నాయిన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీటన్నింటినీ పునాదుల నుండి అభివృద్ధి చేయవలసి ఉన్నందున, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇది ఎలా సాధ్యమవుతుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీకి రాజధాని నిర్మించటంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలను అభివృద్ధి చేయటం అనేది ఎంతో పెద్ద పని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమని స్పష్టం చేశారు.
అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మూడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యేక కేటాయింపులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.