వైసిపి ఎమ్మెల్యే ఆరోపణలకు...ట్విట్టర్ లో లోకేష్ కౌంటర్లు
అమరావతి:ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ వైకాపా ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ ట్వీట్టర్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు.
''మీపై నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని కొన్ని నియోజకవర్గాల్లో గెలిపించారు. కానీ మీరు ప్రజలకు తిరిగి ఏం ఇచ్చారు?...వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగిందే లేదు...వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని అన్ని సౌకర్యాలు పొందుతున్నారు...ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా...మేం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం''...అని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా రాష్ట్రం మొత్తాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిపిస్తున్నదని లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే వైసీపీ ఆరోపణలపై ఆయన ఫ్యాక్ట్ షీట్ కూడా విడుదల చేశారు.