జగన్ రెడ్డి ఇళ్ళ స్థలాల అమ్మకం పథకం: సీఎం జగన్ టార్గెట్ గా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలను అందించాలని యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ జరుపుతోంది వైసిపి ప్రభుత్వం. ఇళ్ల స్థలాల పట్టాలు జూలై 8 వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నిరుపేదలకు పంపిణీ చేయాలని భావిస్తుంది జగన్ సర్కార్. ఇక ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పేదల స్థలాలను బలవంతంగా లాక్కుని తిరిగి పేదలకు అమ్మడమే స్కీం
ఏపీలో నిరుపేదలకు భూములు ఇస్తామన్న పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నారు టిడిపి నేతలు. డబ్బులు తీసుకొని పేదలకు స్థలాలు ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పేదల స్థలాలను బలవంతంగా లాక్కుని తిరిగి పేదలకు అమ్మడమే జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం అని నారా లోకేష్ ఘాటుగా విమర్శించారు.
మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా పేదలను కనికరించని సర్కార్
ఇక వివిధ జిల్లాలలో నిరుపేదల గుడిసెలు బలవంతంగా తొలగించి ఆ స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా సేకరిస్తున్నారు అని నిప్పులు చెరిగారు లోకేష్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా నిరుపేదల గుడిశెలు మాత్రం తొలగించకుండా ఊరుకోలేదని, వైసిపి ప్రభుత్వం ఏమాత్రం పేదల మీద జాలి లేకుండా ప్రవర్తించిందని వీడియో తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నారా లోకేష్.
పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కొంటూ జగన్ రెడ్డి దౌర్జన్యం
ఇక అంతే కాదు ఇప్పటికే వారికి సంబంధించి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించవద్దని కోర్టు స్టే ఇచ్చింది అని పేర్కొన్నారు. 1999లో టిడిపి ప్రభుత్వం యాభై ఎకరాలలో 964 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కోవడం ఖండిస్తున్నాను అని లోకేష్ పేర్కొన్నారు. భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారు అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
Recommended Video
వైసీపీ ల్యాండ్ మాఫియా అక్రమాలు
ఇక ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే పేదల దగ్గరే లాక్కుని పేదలకు ఇవ్వటం ఏమిటి అది కూడా డబ్బు తీసుకుని పట్టాలు ఇవ్వటం అవినీతి కాదా అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నారా లోకేష్ జగన్ టార్గెట్ గా ఇళ్ళ పట్టాల పంపిణీ పథకంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.