వైయస్ జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు: లోకేష్ ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పాలనను టార్గెట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. అధికార పార్టీకి సంబంధించిన ఒక సర్పంచ్ బరితెగించి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక యువతిపై ఫోన్ లో వేధింపులకు పాల్పడుతున్నారని, ఇక ఈ విషయం తెలిసిన సదరు మహిళా ఉద్యోగిని స్నేహితుడు సర్పంచ్ తీరుపై ఫోన్ లో స్టేటస్ పెట్టడంతో, మరింత రెచ్చిపోయి అనుచరులతో అతనిపై దాడి చేయించాడని, అతని పై తప్పుడు కేసులు బనాయించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని లోకేష్ మండిపడ్డారు.

వైయస్ జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు
ఇక ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ను ప్రశ్నించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైసిపి పాలనలో మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ పాలనలో గజానికో వైసిపి గాంధారి కొడుకు పుట్టుకొచ్చి మహిళల్ని వేధిస్తున్నాడు అంటూ లోకేష్ పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు వైసీపీ హయాంలో నిత్య కృత్యంగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులే కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఫోన్లో మహిళను వేధిస్తున్న వైసీపీ నాయకుడు.. లోకేష్ ఆగ్రహం
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసిపి సర్పంచ్ కన్నం శ్యామ్బరితెగించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్లో వేధించాడని వెల్లడించారు. ఆమెకు అండగా నిలిచిన స్నేహితుడు సుదర్శన్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడేలా పోలీసులతో కలిసి బెదిరించాడని ఆరోపించారు లోకేష్. వైసీపీ నేతలతో పాటు పోలీసుల వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు జరిగిందంతా వీడియోలో చెప్పాడని లోకేష్ వెల్లడించారు.

వైసిపి నాయకులే మహిళల పట్ల కాలయముళ్ళలా కాటేస్తున్నారు
వైసిపి నాయకులే మహిళల పట్ల కాలయముళ్ళ మాదిరిగా మారి కాటేస్తుంటే గన్ కంటే ముందొస్తానంటూ సినిమా డైలాగ్స్ కొట్టిన జగన్ రెడ్డి గారు ఎక్కడ? అంటూ లోకేష్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. యువతిని వేధించి ఆమె స్నేహితుడు ఆత్మహత్యకు కారణమైన సర్పంచ్, అతని అనుచరులు, ఈ దారుణానికి సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఏది చెప్తే పోలీసులు అదే నిజమని సామాన్యులను వేధిస్తున్నారని ఆరోపించారు. వైసిపి అరాచక పాలనలో మహిళలపై వేధింపుల నిత్యకృత్యంగా మారాయి అన్న లోకేష్ అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనతో జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications