మనువడు కూడా చంద్రబాబును గుర్తుపట్టట్లేదు: నారా లోకేష్ ఆవేదన
చిత్తూరు : ఏపీ పాలనా పర్యవేక్షణలో బిజీబీజీగా గడుపుతుండడం వల్ల తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పలు సందర్బాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ జాతీయ కార్యదర్శి, తనయుడు లోకేష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మనువడు దేవాన్ష్ తో గడిపేందుకు తన తండ్రికి తీరిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలోని తన సొంతూరు అయిన నారావారిపల్లెలో పర్యటిస్తున్న లోకేష్ గురువారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. నారావారి పల్లెకు దగ్గరలోని రామచంద్రాపురంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మహానాడు భోజన కమిటీ సన్మాన కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన లోకేష్.. విభజన నేపథ్యంలో ఏపీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు.
పనుల ఒత్తిడితో కుటుంబానికి కూడా చంద్రబాబు సమయం కేటాయించలేకపోతున్నారన్న లోకేష్.. నిద్ర లేచాక తెల్లవారుజామునే కార్యాలయానికి వెళ్లే చంద్రబాబు అర్థరాత్రి దాటినా ఇంటికి రాలేకపోతున్నారని, అంతలా ఆయన కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు.

'రాజధానిని నిర్మిస్తున్నందుకా చెప్పుతో కొట్టేది..?'
ఇక తన కుమారుడు దేవాన్ష్ తన తండ్రిని ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తున్నాడని, మనువడితో గడిపేంత తీరిక కూడా లేకుండా చంద్రబాబు రాష్ట్ర వ్యవహారాలతోనే తీరిక లేకుండా గడుపుతున్నారన్నారు. విభజన జరిగాక సీఎం హోదాలో సెక్రటేరియట్ కి వెళ్లిన తన తండ్రికి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఇక ఇదే కార్యక్రమంలో ప్రతిపక్ష వైసీపీ తీరును తప్పుబట్టిన లోకేష్.. రైతు భరోసా యాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ 'చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ..' చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాజధానిని నిర్మిస్తున్నందుకా ఆయన్ను చెప్పుతో కొట్టేది..? అంటూ ప్రశ్నించారు.

జగన్ వ్యాఖ్యలు దారుణమంటూ అసహనం వ్యక్తం చేసిన లోకేష్, తనపై వైసీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలను నిరూపించాలని మహానాడు వేదికపైనే చెప్పానని, ఇంతవరకూ వైసీపీ నేతలు దాని పట్ల స్పందించలేదని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని, 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications