నాన్న స్పీడు అందుకోలేక పోతున్నా....నేను ఇల్లు కట్టాకే అవి అర్ధమయ్యాయంటున్నలోకేష్
విజయవాడ: తన కంటే వయసులో 33 ఏళ్ల పెద్దయిన నాన్న చంద్రబాబు స్పీడును తాను అందుకోలేకపోతున్నానంటూ ఐటి మంత్రి లోకేష్ చమత్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో లోకేష్ ఈ సరదా వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ ప్రదర్శిస్తున్న సమయస్ఫూర్తి సభికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈమధ్య కాలంలో లోకేష్ ప్రసంగాల్లోని చమత్కారాలు ఆయనకు ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా నాన్న స్పీడు అందుకోలేక పోతున్నానంటూ చమత్కరిస్తూనే తండ్రి నిర్విరామకృషిని పరోక్షంగా ప్రస్తావిస్తున్న తీరుతో అభినందనలు అందుకుంటున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలోను బిల్డర్ల ఇబ్బందులపై లోకేష్ సమయస్పూర్తితో స్పందించి నవ్వులు పూయించడంతో పాటు వారికి భరోసా నివ్వడం లోకేష్ చతురతకు నిదర్శనంలా నిలుస్తోంది.
నాన్న స్పీడు...అందుకోలేకపోతున్నా....
సీఎం చంద్రబాబు గారికి అరవై ఏడేళ్లు...నాకు 34 ఏళ్లే. అయినా ఆయన స్పీడును నేను అందుకోలేకపోతున్నా. నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడుతున్న నాయకుడు చంద్రబాబు. మన కోసం కష్టపడుతున్న ఆయనకు 2019లో మళ్లీ ఓట్లేసి గెలిపించి సీఎంని చేద్దామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో శనివారం జరిగిన ‘జన్మభూమి-మా ఊరు' గ్రామసభలో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో రాష్ట్రాభివృద్దికి సిఎం చంద్రబాబు చేస్తున్న కృషిని లోకేష్ వివరించారు. అలాగే త్వరలో గ్రామ పంచాయితీలకు స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
లోకేష్...సమయస్ఫూర్తి...
విజయవాడలో 3 రోజులపాటు జరిగే క్రెడాయ్ ప్రాపర్టీ షో ను ఐటి మినిస్టర్ లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిల్డర్లు తమ సమస్యల గురించి లోకేష్ కు వివరించగా అందుకు లోకేష్ సమయస్ఫూర్తితో ఇచ్చిన జవాబు నవ్వులు పూయించడంతో పాటు సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చినట్లయింది. తాను ఇల్లు కట్టాకే బిల్డర్ల ఇబ్బందులు ఏంటో అర్థమయ్యాయని, వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలిసాయని లోకేష్ అన్నారు. అందువల్ల బిల్డర్ల సమస్యలను తప్పకుండా జిఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి వారి ఇబ్బందులు తొలగించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జి.ఎస్.టి, రెరా చట్టం ఇబ్బందులపై దృష్టి పెడతామన్నారు. అలాగే బిల్డర్ల సమస్యల పరిష్కారానికి వర్కింగ్ కమిటీ వేస్తామని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు.
ఐటి స్పేస్ లేదు...
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మన దగ్గర కావాల్సినంత ఐటి స్పేస్ సిద్ధంగా లేదు. పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నా స్థలం చూపించలేకపోతున్నామన్నారు. డెవలపర్లు ఐటి స్పేస్ చూపించే బాధ్యత తీసుకోవాలి. అందుకే క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో కట్టిన ఇళ్లు నిండాలంటే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఐ.టి కంపెనీలకు స్పేస్ ఇవ్వాలని రాష్ట్ర ఐ.టి, లోకేష్ అన్నారు. అలాగే ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉందని, అలా ఇస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నారు.
అమీర్ పేట లాగా...అమరావతిలో...ఐటి
అమీర్పేటలో మాదిరిగానే అమరావతిలో చిన్న సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నామని, అందుకు తగిన విధంగా ఐ.టి స్పేస్ను కూడా సిద్దం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఐటీ కంపెనీలు ఏర్పాటుకు 60 లక్షల చదరపు అడుగులు స్పేస్ అవసరమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెంటల్ గ్యారంటీ విధానం (డి.టి.పి) తీసుకువచ్చామని, దీనివల్ల ఐ.టి సంస్థలు ఏర్పాటు చేసేవారికి అద్దెలో కొంత భాగం లేక మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించే అవకాశం ఏర్పడిందన్నారు. ఐ.టి సంస్థల్లో లక్ష ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
సిఎం ముందుచూపు...
2014లో విభజనతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులకు ఎటువంటి వసతులు లేవని, ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అమరావతి రాజధాని కోసం 35 వేల ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 10 సంవత్సరాలు ఉన్నా మనకంటూ మన రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ప్రస్థానం మద్రాస్ రాష్ట్రంతో మొదలై కర్నూలు రాజధానిగా ఏర్పడటం అనంతరం హైదరాబాదు రాజధానిగా 58 సంవత్సరాలు సమైక్యంగా ఉన్నామన్నారు. విభజనతో రాష్ట్రంలో కష్టాలు బహుముఖంగా వచ్చాయన్నారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడు ముందుచూపుకు నిదర్శనమన్నారు.