ఏం చదువుకున్నాడో తెలియని జగన్ కు చట్టాల గురించి ఏం తెలుసు: లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు మూడు రాజధానులు వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వికేంద్రీకరణ పై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టుల పై వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసనసభకు అధికారం లేదని కోర్టు చెప్పిందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరిగిందని, పార్లమెంటు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించటం సరికాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ కు చట్టాల గురించి ఏం తెలుస్తుంది
కోర్టు వద్దని చెప్పినా వైసీపీ ప్రభుత్వం మూర్ఖంగా మూడు రాజధానుల విషయంలో వ్యవహరిస్తోందని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ కేబినెట్ లో 90 శాతం టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అసలు ఏం చదువుకున్నాడో తెలియని జగన్మోహన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుందంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.

డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే కొత్త జిల్లాల ఏర్పాటు
జగన్ సర్కారు తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటూ మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురాని వారు ఇప్పుడు జిల్లాల విభజన చేస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుందా అంటూ లోకేష్ ప్రశ్నించారు. పరిశ్రమలు లేక, ఉద్యోగాలు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ యువతను, ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చారని లోకేష్ మండిపడ్డారు.

జిల్లాల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా వస్తుందా?
కొత్త జిల్లాల వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించిన లోకేష్, కనీసం దానివల్ల ఒక ఉద్యోగమైనా వస్తుందా అంటూ నిలదీశారు. తమది సింగిల్ పాయింట్ ఎజెండా అని పేర్కొన్న లోకేష్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేదే తమ నినాదమని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఎన్ని పరిశ్రమలు వచ్చింది? వైసిపి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది? ఎన్ని పరిశ్రమలు వచ్చింది? అనే అంశాలపై చర్చకు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.

మైనార్టీ విద్యార్థిని బలవన్మరణంపై లోకేష్ ట్వీట్
మరోవైపు ట్విట్టర్ వేదికగా మీరు పేద మైనారిటీ విద్యార్థిని బలవన్మరణం పై లోకేష్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వైకాపన్ల కంటే ఆఫ్ఘన్ తాలిబన్లు నయం. నాయకుడు జగన్రెడ్డిదేమో పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన దగుల్బాజీ చరిత్ర అయితే...ఆయన పార్టీ నేతలది పదోతరగతిలో తన కూతురు టాపర్గా నిలవాలని నిరుపేద మైనారిటీ విద్యార్థినిని ఏకంగా వెంటాడి వేధించి తూలనాడి స్కూల్ నుంచి పంపేయడం చాలా దారుణం అంటూ పేర్కొన్నారు.

వైసిపి నేతల కంటే ఆఫ్గనిస్థాన్లోని తాలిబన్లు నయం
మరో స్కూల్లో చేరినా వైకాపా కాలకేయులు సునీల్, ప్రిన్సిపాల్ తనకి చేసిన అవమానం..భవిష్యత్తులోనూ చేస్తామన్న నష్టం హెచ్చరికలు తట్టుకోలేక ఆ చదువులతల్లి బలవన్మరణానికి పాల్పడడం అత్యంత విషాద ఘటన అంటూ లోకేష్ పేర్కొన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న చదువుల తల్లి మరణానికి కారణమైన వైకాపా కాలకేయుడు సునీల్, ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని లోకేష్ వెల్లడించారు. వైసిపి నేతల కంటే ఆఫ్గనిస్థాన్లోని తాలిబన్లు నయమని లోకేష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications