ఉద్యోగాల కల్పన నామినేటెడ్ పదవులిచ్చినంత ఈజీ కాదు; తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్: లోకేష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం వెనుకబడిందని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసిన నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు; థూ మీ బతుకు చెడ: విరుచుకుపడ్డ లోకేష్
ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు
దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లు పూర్తికాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో ఉద్యోగావకాశాలకు నంబర్1 గా వున్న ఏపీని ఒక్క చాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఉద్యోగాల కల్పన మీ వాళ్లకి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదు
ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం శూన్యం అని జాతీయ నైపుణ్యాల నివేదిక-2022 వెల్లడించిందని అసహనం వ్యక్తం చేశారు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్ గారు! ఉద్యోగాల కల్పన అంటే మీ కుటుంబానికి, కులానికి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదు జగన్ రెడ్డి గారు అంటూ నారా లోకేష్ చురకలంటించారు. ప్రఖ్యాత కంపెనీలు రప్పించాలంటే కియా వాళ్లని బెదిరించినంత ఈజీ కాదు అంటూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమంటే ప్రజావేదిక కూల్చినంత సులువు కాదు ముఖ్యమంత్రి గారూ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జాబ్ క్యాలెండర్ పై కొనసాగుతున్న పోరాటం ..ప్రభుత్వంపై టీడీపీ ఒత్తిడి
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మరీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లు ప్రకటించడం లేదని నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేకమార్లు జగన్ సర్కార్ పై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిత్యం జగన్ సర్కార్ పై ఒత్తిడి తీసుకు వస్తోంది.
మేకపాటి గౌతమ్ రెడ్డిని టార్గెట్ చేసిన లోకేష్
ఇదిలా ఉంటే ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కళ్లు మూసుకునిపాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు...దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ని టార్గెట్ చేశారు
ఉత్తుత్తి కంపెనీ; ఉత్తుత్తి ఒప్పందాలు ..తేలుకుట్టిన దొంగల్లా సర్కార్ పెద్దలు
అంతేకాదు ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని, 3 లక్షలు కూడా లేని కంపెనీ పెడతామన్న 3 వేల కోట్ల పెట్టుబడి లోగుట్టుని టిడిపి బయటపెట్టిందని నారా లోకేష్ పేర్కొన్నారు. మంత్రి, సర్కారు పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడంలేదు అంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మంత్రి దుబాయ్ పర్యటనను టార్గెట్ చేశారు.