లోకేష్ వర్సెస్ కొడాలి నాని - టార్గెట్ మంగళగిరి : పౌరుషం చూపిస్తానంటూ -ఆర్కే కు సవాల్ ..!!
మంగళగిరి. ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపి..అంతకంటే లోకేష్ కు ప్రతిష్ఠాత్మకం. 2019 ఎన్నికల్లో తొలి సారి అసెంబ్లీ బరిలో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఓడిపోయిన లోకేష్ ..ఇప్పుడు అక్కడే తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన పౌరుషం ఏంటో చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ దొడ్డి దారిన చట్ట సభల్లోకి వచ్చి..మంత్రి అయ్యారంటూ పదే పదే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఓడిపోవటంతో..కుమారుడిని సైతం గెలిపించుకోలేకోయారంటూ టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ నేతలు ఎద్దేవా చేసారు. కానీ, మూడు రాజధానుల నిర్ణయంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

నియోజకవర్గంపై లోకేశ్ ఫోకస్
కరోనా తగ్గిన సమయం నుంచి లోకేష్ తన నియోజకవర్గం పైనే ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యాలయం పైన దాడి తరువాత చంద్రబాబు దీక్ష సమయంలో మంగళగిరి నుంచి గెలిచి పార్టీ అధినేతకు గిఫ్ట్ గా ఇస్తామని ఆ నియోజకవర్గ నేతల ముందు ప్రకటించారు. ఇక, గ్రామ గ్రామాన పర్యటనలు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ పలకరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నారు. అక్కడ పార్టీ కేడర్ కు దగ్గర అవుతున్నారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటూ..ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా కొద్ది రోజులుగా విద్యుత్ కోతలు అమలవుతున్న సమయాల్లో గ్రామాల్లో పర్యటించి..ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు లోకేష్ సవాల్ చేసారు.

ఎమ్మెల్యే ఆర్కేకు సవాల్
మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తాం.. తెదేపా జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే..మంగళగిరి పౌరుషం ఏంటో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. ఇక, ఇదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో లోకేష్ పైన గెలిపిస్తే...ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఆయన సోదరుడికి రాజ్యసభ సీటు ఇవ్వటం...సామాజిక సమీకరణాలతో ఆర్కేకు పదవి దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి సీఎం చంద్రబాబు పైన న్యాయ పోరాటాల్లో ఆర్కే ముందు నిలిచారు. ఇక, తనకు మంత్రి పదవి రాకపోయినా..సీఎం జగన్ కు విధేయుడిగానే ఉంటానని ఆర్కే చెప్పుకొచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు వైసీపీలో అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది.

కొడాలి నానికి బాధ్యతలు..కలిసొచ్చేనా
దీంతో..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆర్కే పోటీ చేస్తారా..లేక, లోకేష్ పైన వ్యూహాత్మకంగా వైసీపీ చేనేత వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తుందా అనే చర్చ సైతం పార్టీలో మొదలైంది. తాను ఓడిన మంగళగిరి నుంచే తిరిగి గెలిచి తన సత్తా చాటాలనేది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని రెండు నియెజకవర్గాలైన తాడికొండ - మంగళగిరి నియోజకవర్గాల్లో తిరిగి వైసీపీ జెండా ఎగురవేయాలనేది వైసీపీ పట్టుదలగా ఉంది. దీంతో..ఇప్పటికే గుంటూరు ప్రాంతీయ సమన్వయకర్తగా కొడాలి నానికి బాధ్యత అప్పగించారు. ప్రత్యేకంగా గుంటూరు నగరంతో పాటుగా.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి కొడాలి నానికి కేటాయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ పైన విరుచుకుపడే కొడాలి నాని..ఈ సారి మంగళగిరి లో లోకేష్ ప్రయత్నాలకు బ్రేకులు వేయగలరా..ఆయన ఎటువంటి వ్యూహాలను మంగళగిరిలో అమలు చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications