నల్లమలలో అర్ధరాత్రి 'నరకం': 8గం. వాళ్ల బాధ వర్ణనాతీతం..
ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోవంతో అతన్ని రక్షించడానికి పోలీసులు 5గం. పాటు శ్రమించాల్సి వచ్చింది.
కర్నూలు: నల్లమల ఘాట్ రోడ్డులో ఓ ప్రమాదం చోటు చేసుకోవడంతో.. కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో వాహనదారులు నరకం అనుభవించారు. ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం 8గం. వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో వాహనదారులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోవంతో అతన్ని రక్షించడానికి పోలీసులు 5గం. పాటు శ్రమించాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నంద్యాల నుంచి గుంటూరు వైపు శనగ లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
లారీల క్యాబిన్లు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయాయంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత శనగ లోడు లారీ డ్రైవర్ అక్కడినుంచి పరారైనట్లు గుర్తించారు. మరో లారీలోని డ్రైవర్ శ్రీనివాసులు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతని ఆర్తనాదాలు విని కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో గ్యాస్ కట్టర్లు, రంపాలు, ప్రొక్లెయినర్లతో వారు రంగంలోకి దిగారు.
ఐదు గంటల పాటు కష్టపడి ఎట్టకేలకు అతన్ని రక్షించగలిగారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటిదాకా వాహనాలన్నీ రోడ్డు పైనే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ట్రాఫిక్ మొత్తం క్లియర్ కావడానికి 8గం. సమయం పట్టడం గమనార్హం.