హోటల్లోకి దూసుకెళ్లిన లారీ;టిఫిన్ చేస్తూ...ముగ్గురు మృత్యువాత...
తూర్పుగోదావరి జిల్లా: తొండంగి మండలం బెండపూడిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్నలారీపై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆ వాహనం రోడ్డుపక్కనున్నహోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం మేరకు...అన్నవరం నుంచి కత్తిపూడి వైపు నేషనల్ హైవే మీద వెళుతున్నఒక ట్రాలీ...బెండపూడి హైస్కూల్ వద్దకు రాగానే అదుపు తప్పింది. లారీ వేగంగా దూసుకుపోతున్నతరుణంలో ఇలా కంట్రోల్ తప్పడంతో ఆ పరిసరాల్లో బీభత్సం సృష్టిస్తూ రోడ్డుపై వెళుతున్నతుమ్మలపల్లి సత్తిబాబు (45) అనే పాదచారిని ఢీ కొట్టి ఎదురుగా వచ్చిన ఆటోని తొక్కేస్తూ రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లి ఆ తరువాత గోడని ఢీ కొట్టి నిలిచిపోయింది.
ట్రాలీ అదుపు తప్పడంతో దాని కింద పడి నుజ్జునజ్జయిన సత్తిబాబు అనే వ్యక్తి వ్యవసాయ కూలీ. అతడు జాతీయ రహదారికి సమీపంలోని కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా, రోడ్డుపై ట్రాలీ తొక్కేసింది. లారీ హోటల్ లోకి దూసుకు రావడంతో ఆ సమయంలో టిఫిన్ చేస్తున్న బూసాల సాయిబాపిరాజు(19), సారిక చంద్రశేఖర్(21) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
కాగా, టిఫిన్ చేస్తూ మృత్యువాతన పడిన వారిలో బాపిరాజు అనే విద్యార్థి పదో తరగతి పూర్తి చేసి తునిలో మెకానిక్ పని నేర్చుకొంటుండగా, మరొకరు కత్తిపూడి పంచాయతీ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చంద్రశేఖర్. ఈ లారీ ఢీ కొని మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.