వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్
విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ్డాయి. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లాయి. దాదాపు అన్ని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వరదనీటితో పోటెత్తుతున్నాయి. నిండుకుండల్లా మారాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేశారు.
ఈ పరిస్థితుల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో సోమవారం వరకు మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. వాయుగుండం ప్రభావం వల్ల ప్రత్యేకించి- ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు.

ఇదివరకు వరుసగా ఏర్పడిన అల్పపీడన వాతావరణంతో పోల్చుకుంటే.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఆవర్తనం భిన్నంగా ఉందని, క్రమంగా అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. క్రమంగా అది ఒడిశా తీరం వైపు కదులుతుందని అభిప్రాయపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీగా, కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో 48 గంటల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు మరి కొంతకాలం పాటు కొనసాగడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. అల్పపీడనం ప్రభావం..ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా తీరంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై పడుతుందని వెల్లడించారు.

కాగా- ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తిన దేశ రాజధాని మరిన్ని గండాలను ఎదుర్కోనుంది. మరో 48 గంటల పాటు ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, పంజాబ్, రాజస్థాన్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వల్ల వచ్చే18వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
శనివారం ఢిల్లీలో కుంభవృష్టి సంభవించిన విషయం తెలిసిందే. కొన్ని గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ధాటికి రహదారులు జలమయయం అయ్యాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరదనీరు చేరింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడు విమానాలు రద్దు అయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఢిల్లీలో సంభవించిన వర్షపాతం 46 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. 110 సెం.మీ వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications