ఆ రోజున.. శ్రీవారి వీఐపీ దర్శనాలు రద్దు- శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీలో మార్పులు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 70,310 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,866 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మూడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 7న చంద్రగ్రహణం. ఈ కారణంగా శ్రీవారి ఆలయం మూతపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు భక్తుల దర్శనానంతరం ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజంతా ఆలయాన్ని తెరవరు. మళ్లీ మరుసటిరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులను తెరుస్తారు అర్చకులు. సుమారు 12 గంటల పాటు ఆ ఏడుకొండలవాడి దర్శనం ఉండబోదు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
7వ తేదీన ఆదివారం రాత్రి 9.50 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభౌతుంది. సోమవారం వేకువజామున 1.31 గంటలకు ముగుస్తుంది. 8న తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు అర్చకులు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభమౌతుంది.
ఆలయం తలుపులు మూసివేత వల్ల 8వ తేదీన వీఐపీ దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. ఎటువంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించబోమని తెలిపింది. 8వ తేదీర నేరుగా స్వామివారి దర్శనానికి వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించింది. దీంతో పాటు 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయంలో కూడా కొన్ని మార్పులు చేసింది టీటీడీ. ఆఫ్ లైన్ టికెట్ల జారీ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చింది.
అలాగే- ఈ నెల 16వ తేదీన కూడా వీఐపీ దర్శనాలు రద్దయ్యాయి. శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా 15వ తేదిన వీఐపీ సిఫారసు లేఖలు టీటీడీ స్వీకరించదు. ఈ నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు.












Click it and Unblock the Notifications