అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసు నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు పైన 2003లో బాంబు దాడికి పాల్పడిన కేసులో కీలక నిందితుడు, మావోయిస్టు దళ సభ్యుడు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రావును పోలీసులు పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2003లో చంద్రబాబు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన తిరుమలకు వెళుతుండగా అలిపిరి వద్ద బాంబు దాడి జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి మావోయిస్టు అగ్రనేత కిషన్జీకి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్న దీపక్ పైన పలు కేసులు నమోదయ్యాయి. ఇతనిని పోలీసులు కోల్కతాలో అరెస్టు చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో దీపక్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులోనే అతడిని రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరచనున్నారని సమాచారం. నేదురుమల్లిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, దీపక్ కోల్కతాలో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారెంట్ పైన అతనిని ఏపీకి తీసుకు వస్తున్నారు.