మున్సిపల్ పోరు బరిలో మాచర్ల దాడి ప్రధాన నిందితుడు: తురకా కిశోర్ తరఫున నామినేషన్ దాఖలు..
గుంటూరు: ఊహించిన విషయమే వాస్తవమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు తురకా కిశోర్.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిల్చున్నారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్గా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.
తురకా కిశోర్ తరఫున నామినేషన్లు వేసిన మహంకాళి..
తురకా కిశోర్ తరఫున..ఆయన అనుచరుడు మహంకాళి కన్నారావు.. శుక్రవారం ఉదయం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహంకాళి కన్నారావు.. వైఎస్ఆర్సీపీ మాచర్ల పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి.. తురకా కిశోర్ తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై దాడి చేసిన కేసులో తురకా కిశోర్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న విషయం తెలిసిందే.
మాచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ రేసులో..
తురకా కిశోర్ పేరు.. మాచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మాచర్ల మున్సిపాలిటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉండటంతో.. ఇక్కడ ఆ పార్టీ మెజారిటీ కౌన్సిల్ స్థానాలను దక్కించుకోవడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో నామినేషన్ దశ నుంచే మున్సిపల్ ఛైర్మన్ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశంపై పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తురకా కిశోర్.. ఆ స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు.
Recommended Video
పిన్నెల్లి ఆశీర్వాదం..
ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఛైర్మన్ కుర్చీలో తురకా కిశోర్ను కూర్చోబెట్టాలని పిన్నెల్లి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇదివరకే ఖరారు చేశారనే వార్తలు కూడా ఉన్నాయి. పిన్నెల్లి ప్రధాన అనుచరుడనే పేరుంది తురకా కిశోర్కు. పైగా వైఎస్ఆర్సీపీ మాచర్ల పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. స్థానికంగా తురకా కిశోర్కు మంచి పట్టు ఉందని, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన.. వంటి అంశాలపై అవగాహన ఉందని అంటున్నారు.
టీడీపీని ఎదుర్కొనే సత్తా..
రాజకీయంగా ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొన గలిగే సత్తా ఉందని చెబుతున్నారు. దీనితో ఆయనను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని అప్పగిస్తే.. పార్టీ మరింత బలోపేతమౌతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపై దాడి చేసిన ఉదంతమే ఆయనలోని తెగువకు నిదర్శనమని మాచర్ల వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తే.. తురకా కిశోర్కు ఛైర్మన్ను చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.