ఏపీని బీహార్లా ఆదుకోండి: ప్రధాని మోడీకి ఎంపీ బాలశౌరి లేఖ
అమరావతి: అకాల వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులు అందరూ వారి నిధులు కేటాయించాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కోరారు. ఏపీలో సంభవించిన విపత్తుపై గురువారం ఈ మేరకు ఎంపీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల ఏపీలో సంభవించిన వరదలు, ఆకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశకు కలిగిన నష్టం భారీగా ఉందని, దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. కేంద్రం, లోక్ సభ, రాజ్యసభలోని ఎంపీలంతా ఏపీకి ఆర్ధిక సహకారం అందించాలంటూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు.. ఎంపీ వేర్వేరుగా లేఖలు రాశారు. ముఖ్యంగా వరదల ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, ప్రజలు సర్వస్వం కోల్పోయారని లేఖలో వివరించారు.

వేల ఎకరాల్లో పంట నష్టం, లక్షల మంది ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి వచ్చేశారన్నారు. రెండు జిల్లాల్లో కలిపి కనీసం 50 మంది వరకూ ప్రాణనష్టం జరిగిందని, రహదారులు, కట్టలు, రైల్వే ట్రాక్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. రెండు జిల్లాల్లో కలిపి కనీసం నాలుగు లక్షల మందికి పైగా ప్రజలపై వరదల ప్రభావం పడిందని, అన్ని రకాలుగానూ నష్టపోయారని వెల్లడించారు.
70 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రధమం..
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో ఎన్నడూ లేనంతగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తిందన్నారు. గత 70 సంవత్సరాల చరిత్రలో ఇంతటి వరద రాలేదని తెలిపారు. ప్రజలు అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుబారిన పడి సర్వస్వం కోల్పోయి, సాయం కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లోక్సభ, రాజ్యసభలో ఉండే ప్రతి ఎంపీ సహకారం అందించాల్సిన సమయం ఉందని బాలశౌరి కోరారు.
ఎంపీలు అందరూ సాయం చేయాలి
2008లో బీహార్ రాష్ట్రంలోని కోసి నదికి వరదలు వచ్చిన సమయంలో రాజ్యసభ, లోక్సభలోని సభ్యులు వారి ఎంపీ ల్యాడ్స్ నిధులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున, ఒక నెల జీతం ఇచ్చి ఆదుకున్న విషయాన్ని బాలశౌరి గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీకి అంతకంటే తీవ్రమైన ప్రకృతి విపత్తు వచ్చిందని, ఒక్కో ఎంపీ కనీసం రూ. 50 లక్షల చొప్పున నిధులు ఇచ్చి సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీహార్ విపత్తు సమయంలో ఎంపీలందరికీ అప్పట్లో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ లేఖలు రాయడంతో ఎంపీలు అందరూ స్పందించారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎంపీలకు లేఖలు రాయాలని ఎంపీ బాలశౌరి కోరారు.












Click it and Unblock the Notifications