జగన్కు మరో షాక్: టిడిపిలోకి మదనపల్లి ఎమ్మెల్యే, 'ఏ ఆధారాలతో బాబుపై పుస్తకం'
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మదనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం నాడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆయన మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని చెప్పారు. వైయస్ జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.
జగన్ పుస్తకంపై గాలి ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన వైయస్ జగన్ వేసిన పుస్తకం తప్పులతడక అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. ఏ ఆధారాలతో జగన్ తమ పార్టీ అధినేత పైన ముస్తకం ముద్రించారని ప్రశ్నించారు.
పదిహేడు వేల ఎకరాలను పదిహేడు లక్షల ఎకరాలుగా చూపించారని ద్వజమెత్తారు. హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్, విప్రో సంస్థలు రావడమే గొప్ప అన్నారు. వాటిల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరమని గాలి విమర్శలు గుప్పించారు.