కరణంకు దెబ్బే: చంద్రబాబుతో మాగుంట భేటీ, మంత్రి పదవి అంటూ ప్రచారం?
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మంగళవారం ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. దసరా సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మాగుంటకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
సీఎంఓ నుంచి అందిన అహ్వానం మేరకు మాగుంట సోమవారం రాత్రి విజయవాడలోని క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిశారు. అప్పటికే అక్కడ అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్తోపాటు, ఇతర జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు.
దీంతో సీఎం చంద్రబాబు మాగుంటను చూసి పలుకరించడంతో పాటు రాత్రికి విజయవాడలోనే ఉండి మంగళవారం కలవాలని సూచించారు. నిజానికి మాగుంటతో సీఎం చంద్రబాబు సోమవారం రాత్రే మాట్లాడాల్సి ఉన్నప్పటికీ, అదే సమయంలో అక్కడ జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ ఉండటంతో మంగళవారం కలిశారు.

సుమారు 15 నిమిషాల పాటు జరిగిన వీరిద్దరి భేటీలో ప్రకాశం జిల్లాకు చెందిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో సీనియర్లు, ఇతర జాతీయ నాయకుల అభిప్రాయం ఎలా ఉందంటూ మాగుంట ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు చేసినట్లు సమాచారం.
వీటికితోడు మాగుంటనుద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాపారపరమైన వ్యవహారాల్లో మీ పాత్ర తగ్గిందా? పిల్లలు వాటి బాధ్యతను చూసే స్థాయిలో ఉన్నారా? మీరు రాజకీయాలకు సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తున్నారా? అంటూ నవ్వుతూనే అడిగినట్లు తెలిసింది.
అవసరమైతే పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తానని, ప్రస్తుతం నెలలో 20 రోజులు ఒంగోలులోనే ఉంటున్నానని ముఖ్యమంత్రికి మాగుంట చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ వారిద్దరి మధ్య నేరుగా ప్రస్తావనకు రానప్పటికీ మీరు చెప్పిన ఏపనైనా, మీరు ఇచ్చిన ఏబాధ్యతనైనా నిర్వహించి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాగుంట చెప్పారని సమాచారం.
ఈ భేటీ అనంతరం ఎమ్మెల్సీ మాగుంటకు సీఎంఓ అధికారులు అభినందిస్తూ మాట్లాడారని సమచారం. కాగా, సీఎం చంద్రబాబుతో భేటీ విషయమై మాగుంట మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని, పార్టీ వ్యవహారాలపై పెద్దగా చర్చ జరగలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications