Mahakumbh 2025: ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: అన్నీ కలిపి ఒక్కొక్కరి ఛార్జీ ఇదీ..!!
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఈ నెల 20వ తేదీ వరకు 8.80 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. తొలి వారం రోజుల్లోనే ఏడు కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారికంగా వెల్లడించింది.

పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. దేశం నలుమూలల నుంచీ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచీ ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటోన్నాయి. 13,000లకు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్రాజ్కు రాకపోకలు సాగించనున్నాయి.
తాజాగా- ఏపీఎస్ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. ప్రయాగ్రాజ్కు ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1వ తేదీన తొలి బస్సు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లనుంది. మహా కుంభ మేళా 2025 యాత్ర స్పెషల్ ప్యాకేజీ కింద దీన్ని నడిపించనుంది. ఏడు రోజుల యాత్ర స్పెషల్ బస్ ఇది.
ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు నుంచి బయలుదేరే బస్సు భువనేశ్వర్, పూరి, కోణార్క్ మీదుగా ప్రయాగ్రాజ్కు చేరుకుంటుంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించి అనంతరం వారణాశికి బయలుదేరుతుంది. వారణాశిలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చు.
ప్రయాగ్రాజ్, వారణాశిల్లో భక్తులకు బస ఏర్పాటు చేశారు. వారణాశి నుంచి గయ, బుద్ధ గయలను సందర్శించిన అనంతరం రాష్ట్రానికి తిరుగుముఖం పడుతుందీ బస్సు. తిరుగు ప్రయాణంలో అరసవిల్లి, శ్రీకూర్మం క్షేత్రాలను భక్తులు దర్శించవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారంతో కలిపి ఒక్కొక్కిరి 10,000 రూపాయల ఛార్జీని వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications