బాత్రూమ్ కి వెళ్లినా.. వేధింపులే.. : జగన్ తో మహాలక్ష్మి
తమ సమస్యలు పరిష్కరించాలంటూ బ్రాండిక్స్ గార్మెంట్స్ కంపెనీ మహిళా కార్మికులు చేస్తున్న ధర్నాకు వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్ష మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మహిళా కార్మికులు చేపట్టిన ధర్నాకు హాజరైన జగన్, సమస్యల గురించి అక్కడి మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహాలక్ష్మి అనే బ్రాండిక్స్ కంపెనీ కార్మికురాలు మాట్లాడుతూ.. కంపెనీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించే ప్రయత్నం చేశారు. యాజమాన్యం కార్మికుల పట్ల ఎంత కర్కషంగా వ్యవహరిస్తుందో చెప్పిన ఆమె.. కనీసం బాత్రూమ్ లోకి వెళ్లినా, యాజమాన్యం వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. బాత్రూమ్ లోకి వెళ్లడమే ఆలస్యం తలుపులు బాదుతారని, ఆరోగ్య సమస్యలున్న టార్గెట్ పూర్తి చేయాలని వేధిస్తున్నారని చెప్పింది మహాలక్ష్మి.
నాలుగేళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న చేతికి అందేది మాత్రం నాలుగు వేలే అని, ఎవరైన అడిగినప్పుడు మాత్రం ఎనిమిది వేల జీతం ఇస్తున్నట్టుగా చెప్పాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలియజేసింది. కంపెనీలో కార్మికులకు పని స్వేచ్చ లేదని, అసలు పనిచేసే వాతావరణమే లేదని పేర్కొంది. టార్గెట్ల పేరుతో హెచ్ఆర్ వాళ్ళు వెంటపడి వేధించడం కార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చింది. మహాలక్ష్మితో పాటు దుర్గమ్మ, విజయదుర్గ, అనే మహిళా కార్మికులు కూడా తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు.