జనసేన ఆధ్వర్యంలో మహాపాదయాత్ర
జనసేన పార్టీ కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. కాకపోతే ఇది మినీ పాదయాత్ర. డిసెంబరు 9వ తేదీన అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో పాదయాత్ర ప్రారంభించి అనకాపల్లిలో ముగించాలని నిర్ణయించింది. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ ఛార్జి సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో పాదయాత్ర జరగబోతోంది. పాదయాత్ర పొడవునా ప్రజల ప్రధాన సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరింపచేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
రహదారుల విస్తరణ కోసం భూసేకరణ ద్వారా నష్టపోతున్న బాధితులకు నష్టపరిహారంపై పాదయాత్రలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనసేన నాయకులు సిద్ధమవుతున్నారు. రోడ్లన్నీ గోతులమయం కావడంతో ప్రజల ఇబ్బందులను కలెక్టర్ కు నివేదించడానికే యాత్ర చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గ ప్రజలంతా పార్టీలకు అతీతంగా పాల్గొని సంఘీభావం తెలియజేయాలని, అలాగే సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరూ పాల్గొనాలన్నారు. అచ్యుతాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలన్నీ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ బస్సు యాత్ర చేయబోతున్నారు. ఇటీవలే రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాల్లో బీజేపీ నేతలు నాలుగురోజులపాటు పాదయాత్ర నిర్వహించారు.