టీలో నెంబర్ ప్లేట్ల మార్పు తప్పదు: మహేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేటు మార్చుకోవాల్సిందేనని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. నెంబర్ ప్లేట్ల సిరీస్ మార్పుపై మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బస్ భవన్లో ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆర్టీసికి రోజుకు రెండు కోట్ల రూపాయల నష్టం వస్తోందని, అయినా ప్రయాణికుల చార్జీలు పెంచబోమని ఆయన అన్నారు. ఆర్టీసికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసిలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
దేశంలోని అన్ని నగరాలకు ధీటుగా రాష్ట్రంలో ఆర్టీసి నిర్వహణను చేపడుతామని ఆయన చెప్పారు. ముంబైలో ఆర్టీసి నిర్వహణ వ్యవస్థను అధ్యయనం చేస్తామని అన్నారు. ముంబై మాదిరిగానే హైదరాబాదులో ఆర్టీసి నిర్వహణ చేపట్టాలనే ఆలోచన ఉందని ఆయన అన్నారు.
టిఎస్ పేరిట వాహనాల రిజిస్ట్రేషన్ నాలుగు నెలల్లో పూర్తి కాకపోతే గడువును మరింత పొడగిస్తామని ఆయన చెప్పారు.