బుర్రిపాలెంలో పూర్వీకుల ఇంట్లో మహేష్ బాబు, ఫ్యాన్స్ కేరింత
గుంటూరు: సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి చేరుకున్నారు. తన బావ, ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి ఆయన గ్రామానికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
బుర్రిపాలెం గ్రామానికి చేరుకున్న మహేష్ బాబు నేరుగా.. తన తాత, తండ్రి నివసించిన ఇంటికి చేరుకున్నారు. వారు నివసించిన ఇంటిలోకి వెళ్లారు. పూర్వీకుల ఇంటికి వెళ్లి దానిని తేరిపారా చూశారు. మహేష్ బాబుకు 70 మంది బౌన్సర్లతో భద్రతను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహేష్ బాబు తన నానమ్మ కట్టించిన పాఠశాలతో పాటు గ్రామంలోని ఆసుపత్రి, పవర్ ప్లాంట్ తదితరాలను అభివృద్ధి చేసేందుకు గ్రామస్థులతో చర్చించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పైలాన్ను ఆవిష్కరించనున్నారు.
తాడేపల్లిలో ఘన స్వాగతం
అంతకుముందు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా చేరుకున్నారు. తాడేపల్లి వద్ద ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అవసరాలు తెలుసుకుని అభివృద్ధి గురించి గ్రామస్థులతో చర్చిస్తారు.
మహేష్ బాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఆయన తాడేపల్లి చేరుకోగానే పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. అభిమానుల కేరింతల మధ్య, వారు ర్యాలీగా అనుసరిస్తుండగా మహేష్ బాబు బుర్రిపాలెం బయల్దేరారు.