మహేష్ బాబు బాబాయికి వైసీపీలో కీలక పదవి, జగన్ వ్యూహమా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయి ఆదిశేషగిరి రావుకు కీలక పదవి దక్కింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రతిపక్షంలో ఉంది. జగన్ ఎనిమిది మందితో కూడిన క్రమశిక్షణ కమిటీని ప్రకటించారు.
ఈ కమిటీలో ఆదిశేషగిరి రావుకు పదవి దక్కింది. ఆదిశేషగిరి రావుతో పాటు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్థసారథి, సాగి దుర్గాప్రసాద రాజు, మేరుగ నాగార్జున తదితరులు ఉన్నారు.
కాగా, 'గడప గడపకు వైసిపి' కార్యక్రమంపై జగన్ గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి పదమూడు జిల్లాల పార్టీ నాయకత్వం హాజరైంది.
మహేష్ బాబాయికి కీలక పదవి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయి ఆదిశేషగిరి రావుకు క్రమశిక్షణ కమిటీలో చోటు కల్పించారు.
జగన్ వ్యూహమా?
వైయస్ జగన్ వ్యూహాత్మకంగానే ఆదిశేషగిరి రావుకు క్రమశిక్షణ కమిటీలో బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
టిడిపికి వీరిద్దరు
టిడిపికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ను టిడిపి మరోసారి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోంది.
రోజా మినహా..
ఈ నేపథ్యంలో వైసిపికి మాత్రం గ్లామర్ అట్రాక్షన్ అంతగా లేదు. రోజా ఉన్నారు. గ్లామర్ కోణంలో ఆలోచించి ఆయనకు బాధ్యతలు అప్పగించి ఉంటారని అంటున్నారు.
జయదేవ్కు ఆది కౌంటర్!
మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టిడిపి నేతగా, ఎంపీగా ఉన్నారు. పార్టీకి కాకపోయినా జయదేవ్ రాజకీయ జీవితంపై మహేష్ బాబు ప్రభావం ఉంటుంది. ఆదిశేషగిరి రావుకు బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ లెక్క సరిపోయిందని భావిస్తుండవచ్చునని అంటున్నారు.