జనసేనానిపై.. మహేష్ కత్తి ప్రశంసలు, టీడీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ స్పందన బేష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు పీకే సరైన లైన్లోకి వచ్చారని.. తన నుంచి కోరుకునేది ఇదేనని పేర్కొన్నారు.
'ఆయన ఆలోచన విధానాన్ని.. అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా'అని కత్తి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అంతేకాదు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, వామపక్షాల మద్దతు కూడా కూడగట్టి బలం పెంచుకోవాలని మహేశ్ సూచించారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడుతుందా? లేదా? అన్నది తాను చెప్పలేనని, ఎందుకంటే టీడీపీ తన పార్టనర్ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
''అవిశ్వాసం తీర్మానం విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దగ్గరుండి అన్నీ చేయాలి. టీడీపీ చేస్తుందా? లేదా? అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే, టీడీపీ నా పార్టనర్ అయితే నేను కచ్చితంగా చెప్పేవాడ్ని.. కానీ టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాళ్లకు మద్దతు మాత్రమే తెలిపాను అంతే. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసం పెట్టి ఆ క్రెడిట్ అంతా మీరే (జగన్) తీసుకుంటే నాకు సంతోషమే. ప్రజల్లో మీకు బలం పెరుగుతుంది.. బలమైన నాయకుల్లాగా ఉంటారు..'' అని పవన్ వ్యాఖ్యానించారు.