టీడీపీలో చీలిక..!? బీజేపీలోకి తెదేపా ఎంపీలు..ముఖ్యులు: ఆ నేతలు వీరేనంటూ కలకలం..!
టీడీపీ అధినేత చంద్రబాబును మోదీ..షా ద్వయం అదను చూసి దెబ్బ కొడుతోంది. పక్కా హ్యూహాత్మకంగా టీడీపీని కోలుకొనే అవకాశం లేకుండా దెబ్బ తీసే వ్యూహాలను అమలు చేస్తోంది. ముందుగా టీడీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుల పైన దృష్టి సారించింది. ఇప్పటికే అయిదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు సైతం అదే బాటలో ఉన్నారు. దీంతో.. ఇప్పుడు పార్లమెంటరీ టీడీపీ పార్టీలో చీలిక అనివార్యం అనే చర్చ మొదలైంది. ఇంతకీ బీజేపీతో టచ్లో ఉన్న వారిగా ప్రచారం జరుగుతున్న పేర్లు ఏంటి..
ఆరుగురిలో అయిదుగురు ఔట్..
ఏపీలో ఘోర పరజయం తరువాత టీడీపీ నేతలకు రాజకీయ భవిష్యత్ పైన అనుమానాలు మొదలయ్యాయి. ఏపీలో వైసీపీ..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంతో అయిదేళ్ల తరువాత పరిస్థితి పైన వారు ఇప్పుడు ఆలోచించం లేదు. మోదీ గతం కంటే బలంగా కనిపిస్తుండటం..టీడీపీ ఎంపీలు స్వతహాగా ఎక్కువ మంది వ్యాపారావేత్తలు కావటం తో వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ ఎంపీల్లో ఒక్కరు మినహా మిగిలిన అయిదుగురు బీజేపీలో చేరటం ఖాయమని చెబుతున్నారు. వారిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మీ పార్టీని వీడుతున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరుగురిలో ఒక్క కనకమేడల రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారంతా బీజేపీలో చేరుతారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు పూర్తయ్యాయని.. త్వరలో చేరికలు పూర్తి అవుతాయని చెబుతున్నారు.
Recommended Video
పార్టీలోని సీనియర్లు సైతం..
రాజ్యసభ సభ్యుల సంగతి ఇలా ఉంటే..ఏపీ నుండి టీడీపీ కేవలం ముగ్గురు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. అందులో కీలకమైన విజయవాడ నుండి గెలిచిన కేశినేని ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన గెలిచిన సమయం నుండి టీడీపీ అధినాయకత్వం మీద వ్యంగాస్త్రాలతో తన అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరో ఎంపీ పేరు ప్రచారంలో ఉంది. ఇక, ఏపీలో గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రి..పార్టీలో సీనియర్గా ఉంటూ హవా సృష్టించిన మాజీ ఎమ్మెల్యే సైతం ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ ఎంపీ కుటుంబంతో బీజేపీ సంప్రదంపులు చేసినట్లు ఆయన సోదరుడే అంగీకరించారు. మరి కొంత మంది ఎమ్మెల్యేలు సైతం బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. వీరంతా ఈ వారంలోనే బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీలో చీలక తప్పదా..ఎందుకంటే..
రాజ్యసభలోని ఆరుగురు..లోక్సభలోని ముగ్గురు సభ్యుల్లో మెజార్టీ సభ్యులు బీజేపీలోకి వెళ్తే ఖచ్చితంగా అది టీడీపీలో చీలికకు కారణం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు 102 మంది సభ్యులు ఉన్నారు. వారిలో బీజేపీకి 71 మంది ఉన్నారు. కీలక బిల్లుల ఆమోదానికి ఆ మెజార్టీ సరిపోదు. ఎన్డీఏ బలం 106కు త్వరలో చేరనుంది. అయినా..ఈ దఫా తాము పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న సమయంలోనే ఒక దేశం..ఒకే ఎన్నిక, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి బిల్లులను ఆమోదం పొందేలా చూడటానికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు బీజేపీకి అవసరం. దీంతో..తమ బలం పెంచుకోవటం..అదే సమయంలో తమను ఏపీలో దెబ్బతీసి..రాజకీయంగా నష్టం చేయాలని ప్రయత్నాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక రాజకీయంగా కోలుకోలేని విధంగా చేయటం ఇప్పుడు బీజేపీ నేతలు అనుసరిస్తున్న వ్యూహం.