యానాంలో 5వసారి మల్లాడి కృష్ణారావు గెలుపు, పుదుచ్చేరిలో హంగ్?
యానాం: పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కనబర్చిన ఆయన ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20,801 ఓట్లు సాధించారు.
అలిండియా నమదు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిపోటి భైరవస్వామి 12,047 ఓట్లతో తర్వాత స్థానంలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి సాయి కుమార్కు 343 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కనకాల రామదాసుకు 148 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. యానాం పుదుచ్చేరిలో భాగమైనప్పటికీ ఏపీని ఆనుకొని ఉంటుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మల్లాది వరుసగా ఐదోసారి గెలుపొందారు.

ఈ సందర్భంగా మల్లాది మాట్లాడుతూ... తనను ఆదరించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను పునరంకితం అవుతానని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తానని చెప్పారు.
కాగా, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 16. రంగస్వామి కాంగ్రెస్ పార్టీ 11, డీఎంకే - కాంగ్రెస్ పార్టీ 14, అన్నాడీఎంకే 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications