బాబూ! వెరీ గుడ్: కేంద్రం మీద పోరాటంపై మమత, అవిశ్వాసంపై దిగొచ్చిన మోడీ!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
చదవండి: అమిత్ షా లేఖపై వైయస్ జగన్ స్పందన, పవన్పై మహేష్ కత్తి
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని ఆమె కితాబిచ్చారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలామంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని బీజేపీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు.
చదవండి: ఎప్పుడో రంగంలోకి దిగారు!: మురళీ మోహన్ రాజకీయ వారసులు ఆమెనా?
చంద్రబాబు వెరీ గుడ్
చంద్రబాబు నాయుడు నిజాలు బయటపెడుతున్నందుకు అభినందిస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వెరీ గుడ్ అన్నారు. చాలామంది సోకాల్డ్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. అది అలవాటుగా మార్చుకున్నారన్నారు.
ఫేక్ ఫెడరలిజం
తాము రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రాలను బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆగ్రహించారు. ఇది ఫేక్ ఫెడరలిజం అని విమర్శించారు. అమిత్ షా లేఖకు చంద్రబాబు ధీటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత స్పందించారు.
అవిశ్వాసంపై దిగొచ్చిన కేంద్రం!
ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, వైసీపీలు గత వారం రోజులుగా పార్లమెంటులో అవిశ్వాసం నోటీసు ఇస్తున్నారు. ఇన్నాళ్లు సభ సజావుగా సాగడం లేదని చెప్పిన అధికార పార్టీ, మంగళవారం అవిశ్వాసంపై చర్చకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారని తెలుస్తోంది.
సభా వేదికగా చెబుతాం
ఇప్పటికే వైసీపీ, టీడీపీలతో పాటు కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. తమను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేస్తున్నారని, ఇప్పటికీ వాస్తవాలు సభా వేదికగా చెప్పకుంటే మనకు ఇబ్బందులు అని, ఏపీకి ఏమిచ్చామో సభా వేదికగా చెబుతామని, అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారని బీజేపీ భావిస్తోందని సమాచారం. ప్రజలకు వాస్తవాలు చెప్పి టీడీపీతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు సభలో మంగళవారం ఆందోళన చేపట్టకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్లకు హామీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.