భార్యను హత్య చేసి...ఆత్మహత్యలా చిత్రీకరించాడు...కానీ...
గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో భార్యపై అనుమానంతో ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కసాయి భర్త చివరకు పోలీసులకు దొరికి పోయాడు. హీటర్ పట్టుకోవడంతో కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని అందర్నీ నమ్మించిన ఈ హంతకుడు పోలీసుల కళ్లు మాత్రం కప్పలేకపోయాడు. పోలీసులు అప్రమప్తతతో వ్యవహరించి హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ హత్య కేసును చేధించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన జెనిత అనే మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం బుధవారం రూరల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 18న హీటర్ పట్టుకోవడం వల్ల విద్యుత్ షాక్కు గురై జెనిత మృతి చెందినట్లు ఆమె భర్త తెలిపాడంటూ హతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఇన్ఛార్జి సీఐ నాగేశ్వరరావు, ఎస్సై నఫీజ్బాషా ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. హతురాలి భర్త రాంబాబును వివరాలు అడుగగా భార్య నీళ్లు కాచేందుకు హీటర్ ను బక్కెట్లో పెట్టిందని, నీళ్లు ఎంత వేడెక్కాయో చూసేందుకు బక్కెట్ లో చేయిపెట్టడంతో షాక్ కొట్టి చనిపోయిందని చెప్పాడు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు బక్కెట్లో రెండు మగ్గుల కంటే ఎక్కువ నీళ్లు లేకపోవడం గమనించారు.
దీంతో అనుమానం వచ్చిన వారు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఆ తరువాత భార్యాభర్తలు నిద్రించిన గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ భార్య జెనిత చేతి గాజులు పగిలిన ముక్కలు పడిఉండటంతో అక్కడ ఏదో గొడవ జరిగిందని, ఆ నేపథ్యంలోనే హత్య జరిగివుంటుందని పోలీసులు భావించారు. ఆ ప్రకారం మరిన్ని ఆధారాల కోసం ప్రయత్నిస్తుండగానే నిందితుడు తాను దొరికిపోవడం ఖాయమని గ్రహించి ఘటనా స్థలాన్నుంచి జారుకొని గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఎదుట భర్త రాంబాబు లొంగిపోయాడు.
తదనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య విషయం, వెనుక కారణాలు వెల్లడించాడు. భార్యకు, తనకు మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోందని, పెద్దలు సర్దిచెబుతుండటంతో కలసి ఉంటున్నామని భర్త రాంబాబు చెప్పాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో తాను లుంగీ, చున్ని సహకారంతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేశానని తెలిపాడు. తర్వాత హీటర్ను ఆమె చేతిలో పెట్టి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు వివరించాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో హత్య జరిగిన 24 గంటల్లోపే అసలు విషయం వెలుగు చూసింది.