దారుణం: టిఫిన్ పెట్టలేదని కోడలిని చంపేసిన మామ
విజయవాడ: నగరంలోని పాయకాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా వచ్చిన కోడలిని కూతురులా చూసుకోవాల్సిన మామ.. ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. తన మాట సాగనివ్వడం లేదనే అక్కసుతో ఆమె గొంతునులిమి చంపేశాడు దుర్మార్గుడైన ఆమె మామ. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేతాజీ రోడ్డులో కనకదుర్గమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న గోగిపూడి సత్యనారాయణకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. అతని భార్య కొంత కాలం క్రితమే మరణించింది.
కాగా, కుమారుడైన గోగిపూడి శివాజి, పాయకాపురంలో నివాసముంటున్న కోనేటి సుమతి (24)లు ప్రేమించి, ఒకరి ఇంట్లో ఒకరు ఒప్పించుకుని గత జూన్లో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భర్తతో మెట్టినింట అడుగు పెట్టింది సుమతి. వారి కాపురం సజావుగానే సాగుతోంది.
అయితే, భార్య చనిపోయినప్పటి నుండి మద్యానికి బానిసైన సత్యనారాయణ చీటికీ మాటికీ కోడలిపై విరుచుకుపడుతుండేవాడు. దీంతో విసుగు చెందిన కొడుకు శివాజి పలుమార్లు తన తండ్రిని మందలించే ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ తండ్రిలో మార్పు రాకపోవడంతో రెండు రోజుల కిత్రం సుమతి విషయమై వీరిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పదే పదే తన భార్యను ఎందుకు వేధిస్తున్నావంటూ తండ్రిపై శివాజీ చేయి చేసుకున్నాడు. దీన్ని మనసులో పెట్టుకున్న తండ్రి శనివారం నాడు కొడుకు రామవరప్పాడులో పెట్రోల్ బంకులో డ్యూటికీ వెళ్లిన అనంతరం టిఫిన్ కోసం కోడలితో గొడవ పెట్టుకున్నాడు శివాజీ తండ్రి.
గొడవ చిలికిచిలికి గాలివానగా మారడంతో మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సత్యనారాయణ సుమతి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కోనేటి వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.