అనుమానం: పుట్టింటికి వెళ్తోందని భార్య చేతులు నరికాడు
అనంతపురం: అనుమానంతో ఓ వ్యక్తి భార్య చేతులను నిర్దాక్షిణ్యంగా నరికేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో జరిగింది. పామిడి మండలానికి చెందిన సన్న ఓబుళేసు, కుమారమ్మ దంపతుల కుమార్తె అనితను స్థానిక నారాయణస్వామి వీధికి చెందిన జయన్న, జయమ్మల కుమారుడు పుల్లయ్యకు ఇచ్చి ఏడేళ్ళ క్రితం వివాహం చేశారు.
రెండేళ్ల నుంచి భార్య అనితపై పుల్లయ్య అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరువురూ గొడవ పడడంతో అనిత పుట్టింటికి వెళ్తానని బయలుదేరింది. ఇంతలో పుల్లయ్య కొడవలితో ఆమె చేతులు నరికాడు. ఈ ఘటనలో అనిత కుడిచెయ్యి మణికట్టు తెగిపోయింది. ఎడమచేయి అరిచెయ్యిపైనా తీవ్రగాయాలయ్యాయి.
కాగా, భార్య చేతులు నరికిన నిందితుడు పుల్లయ్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని మండలం ఆరేకల్లు దగ్గర రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.