ఆమె మరణించిన కాసేపటికే అతనూ!..: అనూహ్య రీతిలో వారిద్దరి మరణం
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యుకులు ఒకేరోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బైక్ పై గ్రామానికి వస్తున్న క్రమంలో వెనుక నుంచి ఓ లారీ వీరిని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ యువతి ఆసుపత్రిలో మరణించగా.. అనంతరం ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అసలేం జరిగింది?:
చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన చోళ్ల శ్రీనివాసు-పద్మల ఏకైక కుమార్తె చోళ్ల అశ్విత. ఇటీవలే నల్లజర్లలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన అశ్విత.. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన జాబ్మేళాకు వెళ్లింది. ఇంటినుంచి వెళ్లేటప్పుడు బస్సులోనే వెళ్లిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో అశ్విత మృతి:
మార్కొండపాడు గ్రామానికే చెందిన ఆనందరావు, నాగమణి దంపతుల కుమారుడు ఉన్నమట్ల సునీల్రాజు జాబ్ మేళాకు వెళ్లి అశ్వితను కలిశాడు. పదో తరగతి వరకే చదువుకున్న సునీల్ రాజు ప్రస్తుతం తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. జాబ్ మేళాలో ఇంటర్వ్యూ తర్వాత ఇద్దరు కలిసి బైక్ పై గ్రామానికి బయలుదేరారు. కానీ మార్గమధ్యలో ఉండ్రాజవరం జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్విత మరణించింది.

సునీల్ రాజు ఆత్మహత్య:
అప్పటిదాకా ఆసుపత్రిలో అశ్వితకు సపర్యలు చేసిన సునీల్ రాజు.. ఆమె మరణించిందని తెలిసి తీవ్రంగా కుమిలిపోయాడు. ఆవేదనతోనో.. భయంతోనో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే రెండు కాళ్లు నుజ్జు నుజ్జయి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు.

ప్రేమా.. స్నేహమేనా?:
అశ్విత-సునీల్ రాజుల మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అయితే వీరిద్దరికి చర్చిలో పరిచయమైందని, మంచి స్నేహితులు అని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా ఒకేరోజు అనూహ్య రీతిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications