చూస్తుండగానే కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్య: కత్తితో పొడుచుకున్న వికలాంగుడు
పశ్చిమగోదావరి: తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ ఓ వ్యక్తి జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వికలాంగుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పురుగుల మందు తాగిన మొదటి వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంలోనూ అధికారులు, పోలీసులు అలసత్వం ప్రదర్శించడంతో అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని కలెక్టర్కు లేఖ రాసి మరీ, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ రెండు ఘటనలు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళితే. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశమందిరంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, ఇతర అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఫిర్యాదుదారులు రావటంతో వారిని క్యూలో పంపుతున్నారు. ఈ వరుసలోనే నిలబడిన ఏలూరు మండలం మహేశ్వరపురానికి చెందిన మోరు వెంగళరావు అనే లారీ డ్రైవర్ పురుగులమందు డబ్బాతో హాజరయ్యారు.
అయితే ఈ డబ్బాను మాత్రం అటు సిబ్బందిగాని, ఇటు పోలీసులుగాని గుర్తించలేదు. అవిధంగా వెంగళరావు డబ్బాతో సహా అధికారుల ముందుకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు ఫిర్యాదుదారులు ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న పురుగులమందు డబ్బాను తీసుకుని తాగేశాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అప్పటికే అతను చాలావరకు మందు తాగేశాడు. ఈపరిణామంతో వెంగళరావును పోలీసులు అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా కిందకు తీసుకువచ్చారు. అక్కడ ఉన్న పోర్టికో దగ్గర ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. ఈలోపు అంబులెన్స్ కోసం పోలీసులు ఫోన్లు చేశారు. అయితే అది సకాలంలో రాకపోవటంతో పక్కనే ఉన్న పోలీసు ఆవుట్పోస్టు వద్ద ఉన్న బెంచ్పై వెంగళరావును పడుకోపెట్టారు.

ఈ సమయంలో అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడటం ప్రారంభమైంది. ఆవెంటనే అతని నోటి వెంట నురగ రావటం కూడా మొదలైంది. చివరకు ఎలాగోలా అతన్ని తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ రావటంతో దానిలో అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని పరిస్దితి విషమించి వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కొద్ది నిముషాల్లోనే అతను మృత్యువాత పడ్డారు.
కాగా, పురుగులమందు డబ్బాతో పాటు అతను ఆత్మహత్య లేఖ కూడా వెంట తీసుకురావటం గమనార్హం. తన అన్నతో ఉన్న వివాదాల కారణంగా తన కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని దానిలో పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్న తన అన్న తనకున్న పలుకుబడితో న్యాయంగా తనకు చెందాల్సిన ఆస్తిని కూడా లాక్కున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
చివరకు తన కుటుంబాన్ని కూడా భయపెట్టడంతో వారు హైదరాబాద్లో తలదాచుకుంటున్నారని, ఎవరి వద్ద చెప్పుకున్నా ఫలితం లేకపోవటంతో తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని దానిలో పేర్కొన్నారు. తన ఆత్మహత్యకు ముగ్గురు కారణమంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను అతడు ఆత్మహత్య చేసుకునే ముందే కలెక్టర్కు చేరవేశాడు.
ఇది ఇలా ఉండగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో మరో ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి చెందిన వికలాంగుడు ఆవుల వెంకటసత్యనారాయణ (42) కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన తన జీవనోపాధికి రెండెకరాల పొలం ఇవ్వాలని కొన్నాళ్ల క్రితం అర్జీ పెట్టుకున్నాడు.
సోమవారం ఏలూరు కలెక్టరేట్లో ‘మీ కోసం(ప్రజావాణి)' కార్యక్రమానికి వచ్చాడు. అతని అర్జీని అధికారులు తీసుకోకపోవడంతో అప్పటికప్పుడే తన వద్ద ఉన్న బటన్నైఫ్తో పొట్టపై, కణతపై పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications