భర్త మృతి: భార్యకు ఫ్రెండ్ వేధింపు, టెక్కీ కేసులో తీర్పు!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి తన స్నేహితుడి భార్యను వేధించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. హైదరాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెట్టగూడలో ఉంటున్న మహిళ హోంగార్డుగా పని చేస్తోంది.
ఆమె భర్త కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. మెట్టుగూడకే చెందిన ప్రయివేటు ఉద్యోగి, భర్త స్నేహితుడు శ్రీనివాస్ గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోమని ఆమెను వేధించసాగాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమె గత నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న అతనిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
మహిళ ఆత్మహత్య
అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ మహిళ తన కూతురుకు విషమిచ్చి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
టెక్కీ కేసులో రేపు తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్టువేర్ ఇంజనీర్ అభయ పైన అత్యాచారం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. గత అక్టోబర్ 18న రాత్రి మాదాపూర్లో బాధితురాలిని అపహరించిన వెంకటేశ్వర్లు, సతీష్ అనే క్యాబ్ డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో వాదనలు ముగిశాయి. బుధవారం తీర్పు రానుంది.