కోరిక తీర్చాల్సిందిగా కోడలికి మామ వేధింపులు.. భరించలేక కొడుకే చంపేశాడు
తూర్పుగోదావరి: మానవ సంబంధాలు ఎంత వికృతరూపం దాలుస్తున్నాయో తెలియజెప్పే ఘటన ఇది. వావి వరుసలు సైతం పక్కనబెట్టి.. కన్న కూతుళ్లపైనే అత్యాచారాలకు తెగబడుతున్న ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.
కడుపున పుట్టకపోయినా.. కోడళ్లను సైతం కడుపున పుట్టిన బిడ్డల్లా చూసుకునే అత్త మామలు చాలామందే ఉంటారు. కానీ తూర్పుగోదావరి నల్లజెర్లకు చెందిన ఓ దుర్మార్గుడు మాత్రం కోడలి పైనే కోరిక పెంచుకున్నాడు. పదే పదే ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.
ఇదంతా చూస్తూ భరించలేకపోయిన కొడుకు.. ఇలాంటి తండ్రి ఉండటం కన్నా చనిపోవడమే మేలని అతన్ని హత్య చేశాడు. నిద్రిస్తున్న సమయంలో దిండుతో అతని మొహం మీద నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కొవ్వూరు సమీపంలో పడేసి తగలబెట్టేశాడు.
ఘటన జరిగిన కొద్దిరోజులకు చిక్కం కృష్ణమూర్తి అనే వ్యక్తి కొద్దిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ జరపగా కొడుకే నిందితుడని తేలింది. తన భార్యను లైంగికంగా వేధించినందుకే తండ్రిని హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు.