బైక్పై వెనక కూర్చుని గొంతు నులిమాడు: మరో బాలుడిని నరికాడు
ఏలూరు: ఓ ఉన్మాది ఓ బాలుడిని అత్యంత దారుణంగా పథకం ప్రకారం హత్య చేశాడు. మరో బాలుడు అతని బారి నుంచి తప్పించుకున్నాడు. వరుసకు కొడుకయ్యే పన్నెండేళ్ల బాలుడిని గొంతు నులిమి హత్యచేసి, మేనల్లుడయ్యే యువకుడిపై హత్యాయత్నానికి ఒడిగట్టాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన అడపా కోట సత్యనారాయణ సోమవారం తనకు వరుసకు కుమారుడయ్యే సాయికిరణ్ (12)ను బైక్పై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లి, గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని పొదల్లో పారేశాడు.
సాయికిరణ్ తండ్రి రాంబాబు నిందితుడు సత్యనారాయణకు పెద్దమ్మ కుమారుడు. ఆ తరువాత నిందితుడు మేనల్లుడు వరసయ్యే కానూని సత్తిబాబు (22)ను తాటాకులు కొట్టడానికి సాయం రమ్మని బైక్పై తీసుకెళ్లాడు. సత్తిబాబును బైక్ నడపమని వెనక కూర్చున్న సత్యనారాయణ కత్తితో సత్తిబాబు తలపై నరికాడు. దీనితో సత్తిబాబు బైక్పై నుండి దూకేశాడు.
ఆ తర్వాత నిందితుడు సత్యనారాయణ అదే బైకుపై పరారయ్యాడు. సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు సత్తిబాబును వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటివరకు సత్యనారాయణ వెంట వెళ్లిన సాయికిరణ్ ఏమయ్యాడనే విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియదు.
సత్తిబాబును నరికిన విషయం తెలుసుకుని ఆదుర్దాగా సాయికిరణ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. చివరకు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లో సాయికిరణ్ మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు.