భార్యను పంపించలేదని కక్ష: అత్తను చంపిన అల్లుడు
విజయవాడు: భార్యను కాపురానికి పంపించడం లేదని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి అత్తను నరికి చంపాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కొమ్మూరుకు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది.
పోలీసుల ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ముసునూరు మండలం గోపవరానికి చెందిన చాటరాతి మనీషాను మూడేళ్ల క్రితం ఆగిరిపల్లి మండలం ములగలమ్మ సూరవరానికి చెందిన జక్కుల ఏసుబాబు వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో మనీషా పుట్టింట్లోనే ఉంటోంది. కాగా, జనవరి ఒకటిన బండారుగూడెంలో చర్చిలో ప్రార్థనలు జరిపించే మొక్కు ఉందని చెప్పి ఏసుబాబు మనీషాను పిలిచాడు. దీంతో ఉదయం తల్లి చాటరాతి లక్ష్మి (40), బాబాయ్ శెట్టి రంగారావుతో కలిసి ద్విచక్రవాహనంపై మనీషా సూరవరం వచ్చింది.
మొక్కు తీర్చుకున్న తర్వాత ఇలా..
మొక్కు తీర్చుకున్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మనీషా తల్లి, బాబాయ్తో కలిసి ద్విచక్రవాహనంపై గోపవరం వెళ్లిపోయింది. భార్యను తనతో కాపురం చేయనీయడం లేదని అప్పటికే అత్తపై ఏసుబాబు కక్ష పెంచుకున్నాడు. దీంతో అతను మరో బైక్పై వారిని వెంబడించాడు.
వారిని ఇలా అటకాయించాడు...
కొమ్మూరు పెద్ద చెరువు కట్ట వద్దకు రాగానే తన బైక్ను వారికి అడ్డుపెట్టి అటకాయించాడు. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో బైక్ వెనుక కూర్చున్న అత్త భుజంపై బలంగా నరికాడు. దీంతో వారు బైక్తో సహా కిందపడిపోయారు. వెంటనే అత్త ఎడమచేతి మణికట్టుపై నరకాడు. దీంతో ఆమె ఎడమచేయి తెగిపడిపోయింది. ఆ వెంటనే కత్తితో ఆమె గొంతు కోసి తన బైక్పై పారిపోయాడు.
అక్కకక్కడే మరణం
ఏసుదాసు దాడిలో లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆగిరిపల్లి ఎస్సై ఎం.లక్ష్మణ్, ఏఎస్సై ఎం.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుమార్తె మనీషా, మరిది రంగారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు.