అనుమానంతో ఘాతుకం: భార్యాబిడ్డలను చంపిన వ్యక్తి
కూనీపూర్ గ్రామానికి చెందిన గోవూరి బాలయ్యకు, కోటగిరి మండలం హంగర్గా గ్రామానికి చెందిన ఈశ్వరితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మౌనిక, సాయికిరణఅ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో బాలయ్య మూడేళ్ల పాటు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత దంపతుల మధ్య కలతలు చెలరేగాయి. వేరే వ్యక్తులతో వైవాహికేతర సంబంధం ఉందంటూ భార్యను అనుమానించి ఆమెతో గొడవ పడతూ వస్తున్నాడు.
చాలా సార్లు కులపంచాయతీలు జరిగాయి. ఒప్పందాలు చేసుకున్నారు. అయినా గొడవలు సద్దుమణగలేదు. దీంతో ఈశ్వరిని తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలయ్య హంగర్ల వెళ్లి పెద్దల సమక్షంలో మాట్లాడించి భార్యను ఇంటికి తెచ్చుకున్నాడు. సోమవారం మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
సోమవారం రాత్రి బాలయ్య ఈశ్వరిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అడ్డు వచ్చిన కూతురిని కూడా చంపాడు. గొడవకు నిద్రలేచిన సాయికిరణ్ పక్కింటికి పరుగెత్తి వారిని నిద్రలేపాడు. వారు వచ్చేలోగా బాలయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈశ్వరి వ్యవసాయ కూలీ కాగా, మౌనిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సాయికిరణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.