కాళ్లను నరికి, తలను చెరువులో పడేశారు!: వివాహేతర సంబంధమేనా?
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని అతి కిరాతకంగా నరికి చంపడంతో పాటు శరీరం నుంచి తలను వేరు చేసి కాళ్ళను నరికి గోతిలో పాతిపెట్టిన ఘటన జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిని అతికిరాతకంగా చంపి పాతిపెట్టారన్న విషయం అటవీశాఖ సిబ్బంది ద్వారా పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. సంఘటన జరిగిన స్థలం బుట్టాయగూడెం మండల పరిధిలోది కాగా వనసంరక్షణ సమితి జంగారెడ్డిగూడెం మండలం మార్కెండేయపురానికి చెందినది.
ఆదివారం ఉదయం తెల్లవారుజామున రామకృష్ణ అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోడానికి అడవిలోని నీటికుంట సమీపానికి వచ్చాడు. అతనికి సెల్ఫోన్ బ్యాటరీ, అక్కడే తవ్విన మట్టి కనిపించింది. దీనిని అతడు అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంచెం దూరంలో కుక్కలు రక్తాన్ని నాకడం గమనించాడు.
దీంతో అనుమానంతో మర్లగూడెం సమీపంలోని నర్సరీలో ఉన్న అటవీశాఖ ఉద్యోగికి సమాచారం అందించాడు. ఈ క్రమంలో ఈ విషయం పై అధికారులకు తెలియడంతో డీఎస్పీ జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాస్యాదవ్, బుట్టాయగూడెం ఎస్ఐ రవికుమార్లను సంఘటనా స్థలానికి పంపారు.

ఈ క్రమంలో బుట్టాయగూడెం వీఆర్ఓ సత్యనారాయణమూర్తి సమక్షంలో పోలీసులు ఆ ప్రదేశంలో మట్టిని తొలగించగా తల లేకుండా మొండెంతో ఉన్న యువకుడి మృతదేహం బయటపడింది. మృతదేహం కింద పగిలిపోయిన సెల్ఫోన్ ఉంది. దాదాపు రెండున్నర అడుగుల గోతిలో కాళ్లను నరికి వెనక్కి మడచి పాతిపెట్టారు.
అంతేకాదు హంతకులు తమతో తెచ్చుకున్న ఆయుధాలాతోనే గొయ్యిని తవ్వినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదే ఆయుధంతో శరీరం నుంచి తలను వేరుచేసి ఉంటారని భావిస్తున్నారు. తల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను వెతికినా దొరకలేదు. యువకుడిని చంపేందుకు ముందు అతని చేత ఫుల్గా మద్యం తాగించారు.
ఈ మేరకు అక్కడ మద్యం బాటిళ్లు లభించాయి. మద్యం తాగించిన తర్వాత మత్తులోని ఆయువకుడిని పక్కనే ఉన్న రేలచెట్టు కొమ్మను విరిచి దాంతో కొట్టారు. దీంతో మృతుడి శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి. మృతుడి కుడిచేతి భుజంపైన బుజ్జి అనే పచ్చబొట్టు ఉంది. మృతదేహానికి నీలంరంగు చొక్కా, కాకి ప్యాంటు ఉన్నాయి.
ఏలూరు నుంచి వచ్చిన పోలీసు జాగిలంతో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుట్టాయగూడెం పోలీసులు కేసు నమోదు చేయగా డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధం లేదా వ్యక్తిగత కక్షలు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మర్లగూడెం అటవీ ప్రాంతంలో హత్యకు గురైన యువకుడి తలను పోలీసులు జంగారెడ్డిగూడెం సంతమార్కెట్ చెరువుగట్టు సమీపంలో ఆదివారం సాయంత్రం కనుగొన్నారు. అనంతరం తలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బుట్టాయగూడెం మండలం పండుగూడెంకు చెందిన టైలర్ రాజుగా పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications